ఖైరతాబాద్, మహా
ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్, బాలిరెడ్డి నగర్ ప్రాంతాల్లో ‘సమస్యలపై సమరం’ పేరుతో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఉత్సాహంగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకీ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా స్థానిక బస్తీల్లో పర్యటించిన మన్నె గోవర్ధన్ రెడ్డికి ప్రజలు తమ కష్టాలను వివరించారు. ముఖ్యంగా వీధి దీపాలు వెలగకపోవడం, రహదారుల దుస్థితిపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. స్పందించిన గోవర్ధన్ రెడ్డి, తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఓటరు నమోదుపై అవగాహన
అభివృద్ధి పనుల పరిశీలనతో పాటు, ఓటరు నమోదు ప్రక్రియపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. వినాయక్ నగర్ బీఎల్ఓ సైదులు, బాలిరెడ్డి నగర్ బీఎల్ఓ యాదయ్యలతో కలిసి ఇంటింటికీ వెళ్ళిన నాయకులు, ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ‘నా ఓటు – నా బాధ్యత’ అనే నినాదంతో ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరసింహ, సుజాత, భాగ్యమ్మ, శ్రీనివాస్ రెడ్డి, రాజు, గురిగాడు, ప్రభాకర్, శేఖర్, సంతోష్, సుదీర్, శ్రీకాంత్, కార్తీక్, రమేష్, సునీల్, చింటూ, మోహన్, ఆకాష్, సురేష్తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.








