అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు శనివారం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ శస్త్రవైద్య నిపుణుడు డాక్టర్ దిన్షా పర్దివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం సుమారు మూడున్నర గంటలపాటు ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం ఆయన అనస్థీషియా ప్రభావం నుంచి కోలుకుంటూ వైద్యుల నిశిత పర్యవేక్షణలో ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
వైద్య పరీక్షల్లో పవన్ కల్యాణ్కు రెండు భుజాల్లోనూ తీవ్రమైన రోటేటర్ కఫ్ గాయాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ముఖ్యంగా కుడి భుజంలో రోటేటర్ కఫ్ చిరగడంతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉండటంతో శస్త్రచికిత్స అవసరమైందని వైద్యులు తెలిపారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే కోలుకునే ప్రక్రియ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉండటంతో ముందుగా కుడి భుజానికే శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు.
వైద్య నిపుణులు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినప్పటికీ, ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పవన్ కల్యాణ్ శస్త్రచికిత్సను వాయిదా వేసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రభుత్వ బాధ్యతలు, ప్రజా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా చూసిన అనంతరం ఆయన ముంబై వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
వైద్యుల సూచనల మేరకు కుడి భుజం పూర్తిగా కోలుకున్న తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విస్తృత ప్రజా పర్యటనలు, రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలతో నిరంతర సమావేశాల కారణంగా 2016లో ఏర్పడిన భుజం గాయాలు క్రమంగా తీవ్రమయ్యాయని అధికారులు వివరించారు. తీవ్ర నొప్పిని భరిస్తూనే పవన్ కల్యాణ్ తన అధికారిక బాధ్యతలను నిరంతరంగా నిర్వర్తిస్తూ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు.
పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.








