- భీమా లిఫ్ట్ ప్రాజెక్టు ప్యాకేజీ-27లో
- రెండు మోటార్లు స్విచ్ ఆన్ చేసిన మంత్రి జూపల్లి
- 29,820 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
- పాన్గల్, వీపనగండ్ల మండలాల రైతులకు ప్రయోజనం
కొల్లాపూర్, మహా : కొల్లాపూర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (ఆర్బీఎల్ఐ-2) ప్యాకేజీ-27లో రెండు మోటార్లను పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్విచ్ ఆన్ చేసి కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. దీంతో ప్యాకేజీ-27 పరిధిలోని 29,820 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. పాన్గల్, వీపనగండ్ల మండలాల్లోని వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన సాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్యాకేజీ-27 పరిధిలోని 29,820 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టామని చెప్పారు. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. సాగునీటి లభ్యతతో రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కాలువల నిర్వహణ, నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.







