- జనగణన 2027
- 40 ప్రశ్నల జాబితా విడుదల
- తొలిసారి కులాల లెక్కలు
- గెజిట్ విుదల చేసిన కేంద్ర ప్రబుత్వం
న్యూఢిల్లీ, మహా : దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జనగణన 2027’ ప్రక్రియలో అత్యంత కీలకమైన అడుగు పడింది. జనాభా సేకరణ (పాపులేషన్ ఎన్యుమరేషన్) రెండో దశలో భాగంగా ప్రజలను అడగబోయే 40 ప్రశ్నల పూర్తి జాబితాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఈసారి జనాభా లెక్కల్లో భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సమగ్ర కుల గణన చేపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సెన్సస్ యాక్ట్ 1948, సెక్షన్ 8(1) ప్రకారం సంక్రమించిన అధికారాలతో అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి సమాచారం సేకరిస్తారని అందులో పేర్కొన్నారు.
ఈసారి జనగణనలో మునుపెన్నడూ లేని విధంగా కొన్ని కొత్త అంశాలను చేర్చారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వివరాలతో పాటు వ్యక్తి ఏ కులానికి చెందుతారో నేరుగా వెల్లడించే అవకాశం కల్పించారు. దీంతో పాటు డిజిటల్ అక్షరాస్యత, కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రదేశం, బ్యాంక్ ఖాతాల సంఖ్య, ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లభ్యత వంటి సమాచారాన్ని కూడా ప్రభుత్వం ఈ పట్టికలో ప్రతిపాదించింది.
40 ప్రశ్నల పూర్తి వివరాలు ఇవే
జనాభా సేకరణలో భాగంగా ఎన్యుమరేటర్లు పౌరులను అడగే 40 ప్రశ్నల పట్టిక ఇళా ఉంది. 1. వ్యక్తి పేరు. 2. కుటుంబ యజమానితో సంబంధం. 3. లింగం. 4. పుట్టిన తేదీ, వయస్సు. 5. ప్రస్తుత వైవాహిక స్థితి. 6. వివాహ సమయానికి వయస్సు. 7. జీవిత భాగస్వామి పేరు. 8. పౌరసత్వం (స్వయంగా ప్రకటించిన ప్రకారం). 9. మతం. 10. షెడ్యూల్డ్ కులం/ షెడ్యూల్డ్ తెగ/ కులం. 11. తండ్రి వివరాలు. 12. తల్లి వివరాలు. 13. వైకల్యం వివరాలు.14. మాతృభాష, ఇతర తెలిసిన భాషలు. 15. అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత స్థితి. 16. విద్యాసంస్థకు హాజరవుతున్న తీరు. 17. అత్యధిక విద్యా అర్హత, చదివిన విభాగాలు. 18. గత సంవత్సరంలో చేపట్టిన పని/ఉపాధి. 19. ఆర్థిక కార్యకలాపాల వర్గం. 20. వృత్తి. 21. పరిశ్రమ, వ్యాపారం లేదా సేవ స్వభావం. 22. కార్మికుడి వర్గం. 23. ఆర్థికేతర కార్యకలాపాలు (ఉపాధి లేనివారు, స్వల్ప ఉపాధి పొందుతున్నవారి కోసం). 24. పని కోసం వెతుకుతున్నారా/పనికి సిద్ధంగా ఉన్నారా?. 25. పని ప్రదేశానికి ప్రయాణ మార్గం. 26. పుట్టిన ప్రదేశం. 27. చివరిగా నివసించిన ప్రాంతం. 28. వలసకు గల కారణం. 29. ప్రస్తుత గ్రామం/పట్టణంలో నివాస వ్యవధి. 30. శాశ్వత నివాస చిరునామా. 31. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య (వివాహిత, వితంతువు, విడాకులు పొందిన, విడిపోయిన మహిళలకు మాత్రమే). 32. మొత్తం జన్మనిచ్చిన పిల్లల సంఖ్య (వివాహిత, వితంతువు, విడాకులు పొందిన, విడిపోయిన మహిళలకు మాత్రమే). 33. గత ఒక సంవత్సరంలో జన్మనిచ్చిన పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహ బంధంలో ఉన్న మహిళలకు మాత్రమే). 34. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ప్రదేశం. 35. ఉన్న మొత్తం బ్యాంక్ ఖాతాల సంఖ్య. 36. మొబైల్ సంఖ్య (లభ్యతను బట్టి). 37. ఆధార్ సంఖ్య (లభ్యతను బట్టి). 38. ఓటరు ఐడీ సంఖ్య (లభ్యతను బట్టి). 39. పాస్పోర్ట్ సంఖ్య (భారత పాస్పోర్ట్ ఉన్నవారికి). 40. డ్రైవింగ్ లైసెన్స్ లభ్యత.
రెండు దశల్లో జనగణన ప్రక్రియ
గత ఏడాది డిసెంబర్లో కేంద్ర క్యాబినెట్ ‘జనగణన 2027’ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ జనగణనను రెండు ప్రధాన దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశ – ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన (ఏప్రిల్ – సెప్టెంబర్ 2026 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సౌకర్యాన్ని బట్టి 30 రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతుంది. దీనికి ముందు 15 రోజుల పాటు పౌరులు స్వయంగా తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ దశలో నివాస గృహాల పరిస్థితి, సౌకర్యాలు, ఆస్తుల వివరాలను సేకరిస్తారు.
రెండో దశ – జనాభా సేకరణ (ఫిబ్రవరి 2027)
ప్రతి ఇంట్లోని వ్యక్తుల జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, వలసలు, సంతానోత్పత్తి వివరాలను నమోదు చేస్తారు. సీసీపీఏ నిర్ణయం మేరకు ఈ రెండో దశలోనే సమగ్ర కుల గణన ప్రక్రియ పూర్తి చేస్తారు. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని మంచు కురిసే ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండో దశను ముందస్తుగా, అంటే సెప్టెంబర్ 2026లోనే నిర్వహించనున్నారు.
జనగణనకు సంబంధించి క్షేత్రస్థాయి పరిణామాలను గృహనిర్మాణ, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో వెల్లడించారు. “ఇప్పటికే 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన రాష్ట్రాల్లో సెప్టెంబర్ 2026 నాటికి ఈ మొదటి దశను పూర్తి చేస్తాం” అని ఆయన తెలిపారు.
లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మంచు ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుండి 30, 2026 వరకు రెండో దశ జనాభా సేకరణ జరుగుతుందని, అక్టోబర్ 1 నుండి 5 వరకు సవరణల రౌండ్ ఉంటుందని గెజిట్ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.







