- నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ ను హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే
- వీడిన రూపారెడ్డి గత్య కేసు మిస్టరీ
నల్గొండ, మహా :నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కే. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె వద్ద చదువుకున్న విద్యార్థులే అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. గంజాయి వ్యసనంలో పడిన విద్యార్థులు ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 11న కొండమల్లేపల్లిలోని తన నివాసంలో రూపారెడ్డి విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఆమెను టార్గెట్ చేసి, అత్యంత క్రూరంగా చంపేశారు. నిందితులు ఆమె తలపై రెండుసార్లు శరీరంపై 25సార్లు, మొత్తం 27 సార్లు కత్తులతో పొడిచి కిరాతకానికి పాల్పడ్డారు. పోలీస్ క్వార్టర్స్కు అత్యంత సమీపంలో ఈ ఘోరం జరగడం సంచలనంగా మారింది. పోలీసులకు ఈ కేసు సవాల్గా మారడంతో ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక బృందాలు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. వారికి ఒక క్లూ దొరికింది. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజ్లు ధరించిన వ్యక్తి సుమారు ఆరు అడుగుల గోడ దూకి కిచెన్ డోర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి రెడ్ టీషర్ట్ ధరించి ఉండటాన్ని గమనించిన అధికారులు, ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 120 మందికి పైగా అనుమానితులను విచారించగా, అందులో పాఠశాల పాత విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. కాల్ డేటా రికార్డ్స్, స్థానిక నెట్వర్క్ ఆధారంగా విచారించారు. కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. వీరిలో ఒకరిని ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు దారి తీసిన కారణాలు
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం… ఈ ఘాతుకానికి ప్రధాన కారణం గంజాయి వ్యసనం. కొద్దిరోజుల క్రితం నిందితులైన విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని మందలించడమే కాకుండా, వారు గంజాయి సేవిస్తున్న సంగతిని తన మొబైల్లో ఫొటోలు తీశారు. వీడియో షూట్ చేశారు. ఈ ఆధారాలు ఆమె వద్ద ఉంటే తమ భవిష్యత్ నాశమవుతుందని, పాఠశాలలో పరువు పోతుందని భావించిన విద్యార్థులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవడానికి పథకం వేశారు. పక్కా ప్లాన్ ప్రకారం గ్లౌజులు, మాస్క్లు ధరించి ఆమె ఇంట్లోకి ప్రవేశించి కేవలం 9 నిమిషాల్లోనే హత్య చేశారు. హత్య అనంతరం ఆధారాల కోసం మె మొబైల్ ఫోన్ను తీసుకొని పారిపోయారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న సుమారు 4 లక్షల వరకు నగదును కూడా వారు దోచుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న వారికి కోసం పోలీసు బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.








