ఢిల్లీ
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన అత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భారతదేశం ఆర్థికవేత్త, నిరాడంబరి ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని కొల్పోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు. దేశ రూపురేఖలే మార్చేసిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ అని ఆయన సేవలను కొనియాడారు. దశాబ్ద పాలనలో విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత, సమాచార హక్కు చట్టం ఇలా ఎన్నో సంస్కరణలు చేసి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే 15వ లోకసభలో తాను పార్లమెంట్ సభ్యుడిని అని ఎన్నో సమావేశాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి పాల్గొన్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు పార్లమెంట్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టే సమయంలో నేతలందరినీ ఓక్కతోటి పైకి తీసుకురావడానికి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ పట్ల తనకంటూ ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన మన్మోహన్ సింగ్ ఇకలేరు అనే వార్త తీవ్రంగా కలిసి వేస్తుందని, తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్ సింగ్ చిరస్థాయిగా నిలుస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.







