ఏపీలో టీచర్లకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేస్తోంది.
ఇందులో భాగంగా త్వరలో అసెంబ్లీలో ఓ చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాక ఇక ఏటా వేసవిలో టీచర్లను బదిలీ చేస్తారు. అయితే ఇందుకు ప్రస్తుతం ఉన్న బదిలీల నిబంధనలే వర్తింపచేస్తారు.
రాష్ట్రంలో విద్యాసంస్థల్ని గాడిన పెట్టేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్న కూటమి సర్కార్ ఇందులో అత్యంత కీలకమైన టీచర్ల బదిలీల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటోంది. ఇప్పటివరకూ టీచర్ల బదిలీలు ఎప్పుడు జరుగుతాయో తెలియక గందరగోళ పరిస్ధితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వాలు హఠాత్తుగా టీచర్ల బదిలీలు చేపట్టడం లేదా పూర్తిగా వదిలేయడం చేయడం వల్ల స్కూళ్లలో విద్యాబోధన దెబ్బతింటోంది. దీంతో టీచర్ల బదిలీలకు ఓ చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రాష్టంలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న టీచర్ల బదిలీలతో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా ఇకపై వేసవిలోనే ఈ బదిలీలు ఉండేలా చేసేందుకు ప్రత్యేక చట్టం చేయబోతున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో విద్యామంత్రి నారా లోకేష్ ఇప్పటికీ పలు దఫాలుగా చర్చించారు. అనంతరం వారం రోజుల్లో ముసాయిదా చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇది వచ్చాక దీనిపై తిరిగి టీచర్లతో పాటు భాగస్వాములందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. అనంతరం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
ఈ చట్టం అమలులోకి వస్తే ఇకపై ఏటా వేసవిలో మాత్రమే బదిలీలు జరుగుతాయి. అలాగే తప్పనిసరి బదిలీలకు టీచర్లకు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకుంటారు. ఏటా మే 31వ తేదీని కటాఫ్ తేదీగా పరిగణించి సర్వీసును లెక్కిస్తారు. అయితే ఈ బదిలీలకు విద్యా సంవత్సరాలను బదిలీలకు ప్రామాణికంగా తీసుకోవాలని టీచర్లు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం సాధారణ సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని చెబుతోంది. అలాగే జీరో సర్వీసు బదిలీలు ఉండాలని టీచర్లు కోరుతున్నారు. దీనిపై ముసాయిదా బిల్లులో స్పష్టత ఇచ్చే అవకాశముంది.






