రాహుల్ ఆశయం
తెలంగాణ ప్రభుత్వ సంకల్పం
తేలిన కులాల లెక్కలు
దేశంలోనే ఫస్ట్ టైం
– తెలంగాణలో బీసీ జనాభా 56.33శాతం
– బిసిల జనాభా- 46.25 శాతం
– ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08
– కేబినెట్ సబ్ కమిటీకి అందిన రిపోర్ట్
– అధికారికంగా ప్రకటించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ
– సబ్ కమిటీలో ఉత్తమ్, సీతక్క, పొన్నం, దామోదర
– 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు ప్రకటించిన అధికారులు
పట్టుదలగా పూర్తిచేసిన రేవంత్ ప్రభుత్వం
పర్యవసానాలు ఎలా ఉన్నా.. లెక్కలు తేల్చేసిన సర్కార్
ఫిబ్రవరి 4న కేబినెట్ ముందుకు కులగణన సర్వే
ఢిల్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు అడ్వాంటేజ్
హైదరాబాద్, మహా
తెలంగాణలో కులాల లెక్క తేలింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఆశయం మేరకు సామాజిక, కులగణన సర్వేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. రాష్ట్రంలో కులగణన, సామాజిక సర్వే నివేదిక మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీకి అందింది. కులగణన, సామాజిక సర్వేలో రాష్ట్రంలోని 3.54 కోట్ల మంది వివరాలు అందించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఈ కులగణన, సామాజిక సర్వే నివేదికను మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కులగణన అంశంపై ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా కేబినెట్ సబ్కమిటీకి రిపోర్ట్ సమర్పించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో సామాజిక, కులగణన సర్వే చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానించిందని చెప్పారు. బలహీనవర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేపట్టినట్లు వెల్లడించారు.
రాష్ట్ర చరిత్రలో సంచలనం
సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 3.54 కోట్ల మంది ప్రజలు సర్వేలో పాల్గొని వివరాలు అందించారని చెప్పారు. ఇది రాష్ట్ర జనాభాలో 96.9 శాతం అని వెల్లడించారు. రాష్ట్రంలోని 3.1శాతం మంది అంటే 16 లక్షల మంది పలు కారణాల వల్ల వివరాలు అందించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి సహా పలు అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందని చెప్పారు. ఈ కులగణనను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈనెల 4వ తేదీన కేబినెట్ ముందు కులగణన సర్వే నివేదికను ప్రవేశపెడతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. అదే రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేబినెట్లో చర్చించిన వెంటనే దాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలిపారు.
కులగణన సర్వేలోని ముఖ్యాంశాలు
రాష్ట్రంలోని వివరాలు అందించినవారు 3,54,77,554 మంది.
మొత్తం వివరాలు అందించిన కుటుంబాల సంఖ్య 1,12,15,131
కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం
సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతం
కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43 శాతం
ఎస్టీల జనాభా 10.45 శాతం
రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతం
ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08
ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం
ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం
రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం
రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం








