ప్రపంచ దిగ్గజాల కీలక భేటీకి రంగం సిద్దమైంది. ఇతర దేశాల ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సుంకాల రాయితీ, అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తకుండా ట్రంప్ పగ్గాలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ట్రంప్, మోదీ సమావేశంలో వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను వెనక్కి పంపించే ప్రక్రియ జరుగుతుండగా ఆ అంశంపై కూడా ఈ భేటీలో చర్చ జరగవచ్చు. భారత్ అధిక సుంకాలు విధిస్తోంది అంటూ ట్రంప్ విమర్శించినా ప్రధాని మోదీని మాత్రం అద్భుత వ్యక్తిగా కొనియాడారు. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24లో ఇరుదేశాల మధ్య 118 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే 32 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం బలపడుతూ వచ్చింది. బీజింగ్కు చెక్ పెట్టేందుకు న్యూదిల్లీపై అమెరికా అనుకూల వైఖరి ప్రదర్శించడం కూడా అందుకు ప్రధాన కారణం. అమెరికాతో మినీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.
భారత్ను టారిఫ్ కింగ్గా పేర్కొన్న ట్రంప్
అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోంది అంటూ గతంలో ట్రంప్ అనేక సార్లు ఆరోపణలు చేశారు. భారత్ను టారిఫ్ కింగ్గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో సమావేశానికి ముందు భారత్కు అమెరికా ఎగుమతులు పెరిగేలా కొన్ని సుంకాలను మోదీ తగ్గించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా భారత ఎగుమతులపై అమెరికా అదనపు సుంకాలు విధించకుండా నిలువరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించే విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికే చైనాపై 10 శాతం సుంకాలు విధించిన ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. తాజాగా అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై 25 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే 12, 13 తేదీల్లో మోదీ అమెరికా పర్యటన కీలకంగా మారింది. ఇక ఫ్రాన్స్లో నిర్వహించనున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు మోదీ సహ-అధ్యక్షత వహించనున్నారు. ఇందుకోసం సోమవారం ఆయన ఢిల్లీ నుంచి పారిస్ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమం ముగిశాక అమెరికా పర్యటనకు వెళ్తారు.








