Mahaa Daily Exclusive

  ‘యంగ్‌ ఇండియా’ స్కూల్స్‌ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం…!

Share

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌ ఏర్పాటు విషయమై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంద నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ఆదేశించారు. నియోజకవర్గాల్లో స్థతాల కేటాయింపులు పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని తెలిపారు.

స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగిరం చేయాలి
కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక అందించాలన్నారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టేలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతుల వందశాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో, సరైన మౌలిక వసతుల కల్పించాలని, ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.