Mahaa Daily Exclusive

  ఎన్నికల హామీలు ప్రభుత్వం అమలు చేయాలి. – తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్..!

Share

ఆదిలాబాద్, మహా
రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సీఐటీయూ భవనంలో బండి దత్తాత్రి అధ్యక్షతన ఆదిలాబాద్ మండల రైతు సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శోభన్ మాట్లాడారు. తెలంగాణ సమశీతోష్ణ వాతావరణం మూలంగా ఇక్కడ ఉత్పత్తి జరిగిన విత్తనాలు ఎక్కడైనా మొలకెత్తుతాయని తెలిపారు. విత్తన కంపెనీలు రైతులతో నోటిమాట అగ్రిమెంట్ తప్ప రాతపూర్వంగా అగ్రిమెంట్ చేసుకోవడం లేదని లేదు. కంపెనీలకు రైతులకు మధ్య ప్రమోటర్లతో వ్యాపారం సాగిస్తున్నారని పేర్కొన్నారు. వారు రైతులను మోసగించి కంపెనీలకు లాభం చేకూరుస్తున్నారని వివరించారు. విత్తనచట్టం లేకపోవడంతో నాణ్యత లేని, కల్తీ విత్తనాల వ్యాపారం వ్యవస్థీకృతంగా సాగుతోందని వివరించారు. పంటల బీమా, ప్రీమియంను జూలై 30లోపు ప్రభుత్వం కేంద్రానికి చెల్లించాలని అప్పుడు మాత్రమే ఫసల్ భీమా పథకం వర్థిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయ కూలీలు దొరక్కపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చిన్న యంత్రాలను రైతులకు అద్దె కొనుగోలు పద్ధతిపై మండల స్థాయిలో కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. చిన్న కమతాలలో రైతులు వినియోగించే విధంగా యంత్రాలను అందుబాటులో పెట్టాలని సూచించారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, వ్యవసాయోత్పత్తులు పెరగడానికి సాగు చేసే రైతులకు భూములపై హక్కులు చట్టబద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. భూ భారతి చట్టానికి రూల్స్ వచ్చినప్పటికీ నేటికి 15 లక్షల మందికి పాస్ పుస్తకాలు లేవని పేర్కొన్నారు. ఈ సదస్సులో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి దత్తాత్రి, దేవర్త స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేల స్వామి, లంక రాఘవులు, నాయకులు గంగన్న పాల్గొన్నారు.