Mahaa Daily Exclusive

  మళ్లీ క్వారంటైన్, ఐసొలేషన్లు.. కేరళకు కేంద్ర బృందం..

Share

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోయింది. వైరస్ బారిన పడకుండా ఉండటానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. పాజిటివ్ తేలిన వ్యక్తితో నేరుగా కాంటాక్టులోకి వచ్చిన వారిని క్వారంటైన్‌లోకి పంపించారు. అనుమానాలు ఉన్నవారిని ఐసొలేషన్‌లోకి పంపించారు. ఇప్పటికీ క్వారంటైన్, ఐసొలేషన్ ఆందోళన కలుగకమానదు. కానీ, కేరళలో ఈ పరిస్థితులు తప్పేలా లేవు. నిపా వైరస్‌తో మరణించిన 14 ఏళ్ల బాలుడితో నేరుగా కాంటాక్టులోకి వచ్చిన వారిని క్వారంటైన్‌లోకి.. అనుమానితులను ఐసొలేషన్‌లోకి పంపాలని కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి సూచనలు చేసింది. అలాగే.. నిపా వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో భాగంగా కేంద్ర బృందాన్ని కేరళకు పంపించనుంది. నిపా వైరస్‌ను అడ్డుకోవడానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది.

 

కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, నిపా వైరస్‌ను అడ్డుకోవడంలో సహకరించడానికి కేంద్ర బృందం కేరళకు వస్తుందని తెలిపింది. కేరళలోని మల్లపురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడిలో ఏఈఎస్ లక్షణాలు కనిపించాయని, దీంతో పెరింతల్మన్న ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారని వివరించింది. ఆ తర్వాత కోళికోడ్‌లోని పెద్ద ఆసుపత్రికి తరలించారని పేర్కొంది. అయితే, ఈ వైరస్ కారణంగా పేషెంట్ ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. ఆయన శాంపిల్స్‌ను పూణెలోని ఎన్ఐవీకి పంపించగా.. అందులో నిపా వైరస్ పాజిటివ్ అని తేలిందని వివరించింది. మల్లపురంలో నిపా వైరస్ మళ్లీ వెలుగు చూస్తున్న నేపథ్యంలో కేరళకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది.

 

నిపా వైరస్ కన్ఫామ్ అయిన వారి కుటుంబ సభ్యులను వెంటనే పరిశీలించాలని, వారి చుట్టుపక్కల వారిని, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కాంటాక్టు ట్రేసింగ్ చేపట్టాలని కేరళకు కేంద్రం సూచనలు చేసింది. నిపా వైరస్ పాజిటివ్ తేలిన వారితో నేరుగా సంబంధంలోకి వచ్చిన వారిని క్వారంటైన్‌లోకి, వచ్చినట్టు అనుమానాలు ఉన్నవారిని ఐసొలేషన్‌లోకి పంపాలని వివరించింది. అదే సమయంలో వారి శాంపిల్స్‌ను పరీక్షించడానికి ల్యాబ్‌లకు పంపించాలని తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని వన్ హెల్త్ మిషన్ నుంచి మల్టీ మెంబర్ టీమ్‌ను కేరళకు పంపిస్తామని ఈ సందర్భంగా కేంద్రం చెప్పింది.

 

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పేషెంట్ల నిర్వహణ కోసం ఐసీఎంఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీలను పంపించింది. అలాగే.. మొబైల్ బీఎస్ఎల్ 3 లేబరేటరీలను పంపింది. మోనోక్లోనల్ యాంటీబాడీలను కేంద్రం సదరు పేషెంట్ మరణించడానికి ముందే రాష్ట్రానికి అందించింది. కానీ, ఆ పేషెంట్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని కారణంగా వాటిని వినియోగించలేదు.

 

నిపా వైరస్‌కు టీకా లేదా ఔషధాలు లేవు. కానీ, ముందుగా గుర్తించి సపోర్టివ్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో కూడా నిపా వైరస్ కేరళలో రిపోర్ట్ అయింది. చివరిసారిగా 2023లో కోళికోడ్ జిల్లాలో నిపా వైరస్ కనిపించింది.

Latest