హన్మకొండ మహా;
హనుమకొండ బాలసముద్రం లోని రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు.
గురువారం హనుమకొండ బాలసముద్రంలోని రెండు పడక గదుల ఇండ్లను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలసముద్రంలోని రెండు పడక గదుల ఇండ్లను లబ్ధిదారులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం పంపిణీ చేయనున్నామని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సిద్ధం చేయాలని అన్నారు. బ్లాక్ ల వారీగా తాగునీరు, విద్యుత్తు, శానిటేషన్ సమస్యలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, గృహ నిర్మాణ శాఖ పిడి సిద్ధార్థ నాయక్, హనుమకొండ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.








