Mahaa Daily Exclusive

  పాత రూట్లోకి వైసీపీ అధినేత జగన్..?

Share

వైసీపీ అధినేత జగన్ పాత రూట్లోకి వస్తున్నారా? చంద్రబాబు సర్కార్‌ను ఎదుర్కోవడం ఆశామాషీ కాదని ఇప్పుడిప్పుడే అర్థమైందా? జగన్ మార్పు వెనుక ఆ పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు? ఈ అంశాలపై ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్నారు.

 

అధికార టీడీపీపై బురద జల్లటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు చివరకు బూమరాంగ్ అవుతున్నాయి. చివరకు అధినేత డిఫెన్స్‌లో పడిపోతున్నారు. మంత్రి నారాలోకేష్ రెడ్‌ బుక్ అంశాన్ని వీలుచిక్కినప్పుడల్లా పదేపదే ప్రస్తావిస్తున్నారు వైసీపీ అధినేత జగన్.

 

ఏపీ ప్రభుత్వం బుధవారం భారీగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. సగానికి తక్కువగానే అధికారుల కు పోస్టింగ్ ఇచ్చింది. మిగతావారిని హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో ఆదేశించా రు. ఆయా ఉత్తర్వులు చూసి అధికారులే షాకయ్యారు. 57మందికి పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలోపడింది వైసీపీ.

 

ఈ వ్యవహారంపై వైసీపీ రియాక్ట్ అయ్యింది. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యమేలుతోందని దుయ్యబట్టింది. 24 మంది ఐపీఎస్‌లు, 57 మంది డీఎస్పీలకి పోస్టింగ్ ఇవ్వకుండా పోలీసు శాఖపై మంత్రి నారా లోకేష్ కక్ష సాధింపు మొదలుపెట్టారంటూ సోషల్ మీడియా వేదికగా తూర్పారబట్టింది. దేశంలో ఎలాంటి విష సంస్కృతి ఏపీలో ఉందని, పోస్టింగ్‌లు ఇవ్వకుండా చేయడంపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకుందని పేర్కొంది.

 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల్లో ఓ వర్గాన్ని తయారు చేసుకుంది. నచ్చినవారికి ఎక్కడ పడితే అక్కడ పోస్టింగులు ఇచ్చింది. ఆయా అధికారులు గడిచిన ఐదేళ్లలో చెలరేగిపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ అధికారుల జాతకాలు బయటపడ్డాయి. ఆ వర్గానికి న్యాయం చేయడానికి అధికార ప్రభుత్వంతో వైసీపీ పోరాటం చేస్తోంది.

 

చంద్రబాబు సర్కార్ ఇటీవల కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై నేరుగా ప్రధాని లేఖ రాశారు జగన్. ఇప్పుడు డీఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతోంది. అంతేకాదు ఏకంగా రెడ్ బుక్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. రెడ్ బుక్ అంశం జగన్‌ని ఏ విధంగా భయ పెడుతుందో ఇట్టే అర్థమవుతోంది. మొత్తానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని గత వైసీపీ సర్కార్ ఏ విధంగా భ్రష్టు పట్టించిందో తెలుస్తోంది.