Mahaa Daily Exclusive

  ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేస్తాం : అసెంబ్లీలో సీఎం ప్రకటన..

Share

ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. దాని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చిన సుప్రీం ధర్మాసనానికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ సర్కార్ బలమైన వాదనలు వినిపించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటంతోనే సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చిందని తెలిపారు.

 

ఎస్సీ వర్గీకరణను ఆహ్వానిస్తున్నామని, వెంటనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. దేశంలో అందరికంటే ముందే.. ఎస్సీ ఏ, బీ, సీ, డీ వర్గీకరణ అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో ఈ వర్గీకరణను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలుకు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు.

 

ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని తెలిపారు. ఉపకులాల వర్గీకరణ కోసమై తాను, సంపత్ వాయిదా తీర్మానం ఇస్తే.. సభ నుంచి తామిద్దరినీ బహిష్కరించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అఖిలపక్షంతో కలిసి ప్రధాని ముందుకు తీసుకెళ్తామని చెప్పి.. మోసం చేసిందని దుయ్యబట్టారు.

 

ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. గతేడాది డిసెంబర్ 23న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకేట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారని తెలిపారు.

 

ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీలో మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్న తమ కల సాకారం అయిందన్నారు. వర్గీకరణపై అనుకూల తీర్పు రావడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర పాత్ర ఉందని.. వారిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.

Latest