Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు..! నరెడ్కో 15వ సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ..!

Share

  • హైదరాబాద్‌
  • అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు..
  • రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో నగర ముఖ చిత్రం మార్చబోతుంది
  • అభివృద్ధికి సాక్ష్యం రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్ల ధర
  • నరెడ్కో 15వ సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

హైదరాబాద్, మహా: హైదరాబాద్‌ అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత రెండేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వనరులు, అవకాశాలపై ప్రచారం బాధ్యత నరెడ్కోపై ఉందని అన్నారు. అన్నివైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. నరెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. నరెడ్కో బ్రౌచర్‌ను వారు ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు ప్రాపర్టీ షో కొనసాగనుంది. ఇందులో పలు స్థిరాస్తి సంస్థల స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో నగర ముఖ చిత్రం మార్చబోతున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలిసేలా దీని నిర్మాణం ఉంటుందన్నారు. హైడ్రాతో కొంత భయం ఏర్పడినా ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను హైడ్రా కాపాడుతోందని వివరించారు.

 

నగరం నలువైపులా మెట్రోను విస్తరిస్తున్నాం..

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని ప్రచారం చేశారని భట్టి విక్రమార్క గుర్తు చేస్తూ.. రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్ల ధర పలకడంతో నగర అభివృద్ధి ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని వివరించారు. ‘పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపిస్తున్నాం. భవిష్యత్తులో అన్నీ ఇవే ఉంటాయి. వీటికి పన్ను మినహాయింపులు కూడా ఇచ్చాం. మురుగునీటిని శుద్ధి చేయడానికి రూ.4 వేల కోట్ల వ్యయంతో ఎస్టీపీలను నిర్మించబోతున్నాం. నగరం నలువైపులా మెట్రోను విస్తరిస్తున్నాం. విద్య, వైద్య రంగంపై మరింత దృష్టిసారిస్తున్నాం. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో 100 స్కూళ్లను నిర్మించబోతున్నాం. ఇప్పటికే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి. నరెడ్కో ప్రతినిధులు సీఎస్‌ఆర్‌ నిధులను విద్య, వైద్య రంగంపై పెద్దమొత్తంలో ఖర్చు చేయండి. విల్లాలు, హై రైజ్ బిల్డింగులకే పరిమితం కావొద్దు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేయండి. సంపద సృష్టికర్తలుగా రియల్టర్లు, బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది. మీ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని భట్టి విక్రమార్క తెలిపారు