- మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం..
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచి మోదీకి గిఫ్ట్ ఇద్దాం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ జీన్స్ ఒకే విధంగా ఉన్నాయి
- విశ్వనగరం పేరుతో ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నాయి: బీజేపీ స్టేట్ చీఫ్
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నేతలతో రామచందర్ రావు సమావేశం
హైదరాబాద్, మహా: మూడు రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీటు గెలిచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుకగా బీజేపీ శ్రేణులు ఇవ్వాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణ రాష్ట్రంలో సిద్దంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీల సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక, ప్రచార కార్యక్రమాలు, గెలుపు వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జూబ్లీహిల్స్లో తాము గెలుస్తామని పూర్తి నమ్మకం ఉందని, ప్రజలపై విశ్వాసం ఉందని ఉద్ఘాటించారు. విశ్వనగరం పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నగర ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నాయని ఆక్షేపించారు. వర్షం వస్తే ప్రాణాలు పోయే పరిస్థితులు నగరంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ జీన్స్ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ఎర్రగడ్డలో కాలనీల మధ్య ముస్లింలకు శ్మశాన వాటికలు ఎలా కేటాయిస్తున్నారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ దేవాలయాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపించారు. నగరంలో హిందువులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ పరిధిలో గుళ్లు కూలగొడుతున్నారు..
రేపటి నుంచి బీజేపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ జూబ్లీహిల్స్లో గ్రౌండ్ లేవల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని ధ్వజమెత్తారు. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతోందని ప్రజలు కూడా ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము గెలుస్తామనే పూర్తి నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. భాగ్యనగరాన్ని వరల్డ్కే తలమానికంగా మారుస్తామని బీఆర్ఎస్ గతంలో చెప్పిందని.. కానీ అందుకు అనుగుణంగా ఎలాంటి ముందడుగు ఎందుకు పడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ మ్యాన్ హోల్స్లో పడి, అగ్నిప్రమాదాలు జరిగి పలువురు మరణిస్తూనే ఉన్నారని వాపోయారు. ఓట్ల కోసం ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగాయని ఆక్షేపించారు. ఎర్రగడ్డలో ప్రజలు, కాలనీల మధ్య ముస్లింలకు శ్మశాన వాటికకు భూమి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు జూబ్లీహిల్స్ పరిధిలో గుళ్లు కూలగొడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాజకీయ మార్పు చూడాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు తిప్పికొట్టాలని రాంచందర్ రావు సూచించారు.







