* పులివెందులలో వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటన ప్రారంభం.
* నేటి నుంచి ‘ప్రజాదర్బార్’.
పులివెందుల,మహా.
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం తన సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు కడప విమానాశ్రయం నుంచి పులివెందుల మార్గమంతటా పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం సుమారు 4 గంటలకు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న జగన్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘ప్రజాదర్బార్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తనను కలిసేందుకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు, వికలాంగులు మరియు వృద్ధుల సమస్యలను ఆయన ఓపికగా ఆలకించారు. రాత్రి 7 గంటల వరకు సాగిన ఈ ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వందలాది అర్జీలను స్వీకరించిన జగన్, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. రాత్రికి అక్కడి తన నివాసంలోనే ఆయన బస చేస్తారు.
పర్యటనలో భాగంగా రెండో రోజైన బుధవారం వైఎస్ జగన్ లింగాల మండలంలో పర్యటించనున్నారు. ఇటీవల కన్నుమూసిన పార్టీ సీనియర్ నాయకుడు సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన ఇప్పట్ల గ్రామానికి వెళ్లనున్నారు. పరామర్శ అనంతరం తిరిగి పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుని, రెండో విడత ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు మరియు అధికార పార్టీ విమర్శల నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో క్యాడర్ను సమాయత్తం చేయడంతో పాటు ప్రజలతో నేరుగా మమేకమవ్వడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పులివెందులలో కూడా తమ పట్టును నిరూపించుకోవాలని అధికార పార్టీ ఎత్తుగడలు వేస్తున్న తరుణంలో, జగన్ తన సొంత నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.








