Mahaa Daily Exclusive

  నేను మంత్రి పదవి అడగలేదు…

Share

  • నేను మంత్రి పదవి అడగలేదు
  • మా నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారని ఆశిస్తున్నా
  • ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్, మహా : తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదని, తాను కూడా అడగలేదని టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం స్పష్టం చేశారు. అయితే, తన పార్టీ నాయకులకు ప్రభుత్వం త్వరలోనే నామినేటెడ్ పోస్టులు ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రజలు మరియు నాయకులు ఒక రకమైన ‘భయం’ నీడలో బతికారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, “ఇంట్లో ఫోన్ పెట్టి జాగ్రత్తగా రమ్మనే పరిస్థితి ఉండేది” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజల నుంచి దూరమయ్యారని, అందుకే ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక కవిత కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో స్పందిస్తూ ఆమె తన మాటల ద్వారా కుటుంబ లోపాలను బయట పెడుతున్నారని, పార్టీ అంటే కేవలం కుటుంబమే అని ఆమె చర్యలు నిరూపిస్తున్నాయని విమర్శించారు. తాము కేవలం ఎన్నికల కోసం కాకుండా ‘మార్పు’ కోసం పార్టీని నడుపుతున్నామని, అయితే అన్ని ఎన్నికలకూ దూరంగా ఉండలేమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో (బహుశా మున్సిపల్ లేదా జీహెచ్ఎంసీ) కచ్చితంగా పోటీ చేస్తామని, ముందుగానే నియోజకవర్గాలను ఎంచుకుని పనిచేస్తామని ప్రకటించారు.