Mahaa Daily Exclusive

  పన్నులు ఎగ్గొడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు….

Share

పన్నులు ఎగ్గొడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.
• బకాయిల వసూళ్లలో అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టీకరణ.
• పన్నులు చెల్లించని డిఫాల్టర్లపై తక్షణమే చట్టపరమైన చర్యలకు ఆదేశం.
* కార్పొరేట్ విద్యాసంస్థలు, పరిశ్రమలు ఎందుకు ఎగవేస్తున్నాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఆర్థిక పురోగతి, క్షేత్రస్థాయిలో స్వయం సమృద్ధిని సాధించడంపై ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను దర్జాగా ఎగవేస్తున్న భారీ పరిశ్రమలు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం పంచాయతీలకు రావలసిన ఆదాయాన్ని తొక్కిపెడుతున్న ఇలాంటి సంస్థలపై ఏమాత్రం దాక్షిణ్యం చూపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అమరావతిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా రంగాల నుంచి ఏళ్లుగా పేరుకుపోయిన పన్ను బకాయిల వివరాలను పరిశీలించిన పవన్ కల్యాణ్.. ఆ గణాంకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
**సామాన్యుడికి ఒక న్యాయం.. కార్పొరేట్లకు ఒక న్యాయమా?**
గ్రామాల్లో ఉండే సామాన్య పౌరులు, పేదలు తమ సంపాదన తక్కువైనా ఇళ్లు, నల్లా పన్నులను ఎంతో క్రమబద్ధంగా, నిజాయతీగా చెల్లిస్తున్నప్పుడు.. కోట్ల రూపాయల టర్నోవర్లు గడించే పెద్ద పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు తమ సామాజిక బాధ్యతలను ఎందుకు విస్మరిస్తున్నాయని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. “సాధారణ ప్రజలు ఎంతో బాధ్యతగా పన్నులు కడుతున్నారు. మరి భారీ లాభాలు గడించే పరిశ్రమలు, ప్రైవేట్ విద్యాసంస్థలు పంచాయతీలకు చెల్లింపులు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాయి? దేనిని ఆసరాగా చేసుకుని పన్నులు ఎగవేస్తున్నాయి?” అని ఆయన అధికారులను నిలదీశారు. పంచాయతీల అభివృద్ధిని అడ్డుకునే ఇలాంటి ధోరణిని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
**రికవరీలో అలసత్వాన్ని సహించేది లేదు**
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతమైతేనే క్షేత్రస్థాయిలో నిజమైన నవనిర్మాణం సాధ్యమవుతుందని నమ్మే ఉపముఖ్యమంత్రి.. పన్నుల రికవరీ ప్రక్రియలో ఇకపై ఎలాంటి అలసత్వాన్ని, అలసత్వాన్ని సహించేది లేదని అధికారులకు తేల్చి చెప్పారు. సదరు సంస్థల నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల పన్నులను, బకాయిలను పైసాతో సహా పూర్తిగా రికవరీ చేయడానికి అత్యంత కఠినమైన విధానాన్ని అవలంబించాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వసూళ్ల ప్రక్రియలో ఎక్కడా వెనకడుగు వేయవద్దని, ఎలాంటి ఆలస్యం జరగకూడదని హెచ్చరించారు. ప్రభుత్వ నోటీసులకు స్పందించకుండా, నిర్దేశిత నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించని డిఫాల్టర్ పరిశ్రమలు, కార్పొరేట్ విద్యాసంస్థల జాబితాను సిద్ధం చేసి, వారిపై తక్షణమే అవసరమైన చట్టపరమైన చర్యలను ప్రారంభించాలని పవన్ కల్యాణ్ కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని రాబట్టడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని స్పష్టం చేశారు.