వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. దాడులకు పాల్పడినవారిపై పీడీ యాక్టు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ నిర్మాణం కోసం దళితులు, బీసీలపై కేసులు పెట్టించింది గత ప్రభుత్వమేనని బీఆర్ఎస్పై మండిపడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కలెక్టర్పై జరిగిన దాడి విషయంలో కేసీఆర్ స్పందించాలన్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.. కేటీఆర్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం ఉందని అతెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, దీని వెనుక కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు ఇంకా ఎంత పెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.
జైలుకు వెళ్లే సానుభూతి కోసం చిల్లర రాజకీయాలకు బీఆర్ఎస్, కేటీఆర్ పాల్పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. దాడులకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయడానికి వెనుకాడమని అన్నారు. ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో మనీలాండరింగ్పై గవర్నర్ అనుమతిస్తే నిందితులు అరెస్ట్ కావాల్సిందేనని తేల్చి చెప్పారు. జైలుకు వెళ్లకుండా రక్షణ కోసమే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోందన్నారు.
ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారం రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తానన్నారు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్రమంత్రులు మాట్లాడటం లేదన్నారు. బీజేపీ, కేంద్ర మంత్రుల తీరు చూస్తుంటే.. బీఆర్ఎస్కు మద్దతు చేస్తున్నట్లు ఉందన్నారు. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరినీ వదలిపెట్టమని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు.చట్ట ప్రకారం అందరూ శిక్ష అనుభవిస్తారని తెలిపారు.







