ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ అంతకంతకూ వాయిదా పడుతోంది. తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైన ప్రభుత్వం చివరి నిమిషంలో వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో అభ్యర్ధులు డీఎస్సీ ప్రకటనపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ అసెంబ్లీలో డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోకేష్ ఈ వివరాలు వెల్లడించారు.
ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. 1998 డీఎస్సీ బాధితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విద్యామంత్రి నారా లోకేష్. విష్ణుకుమార్రాజు ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 1998 డీఎస్సీ బాధితుల్లో కొందరికి పోస్టులు ఇచ్చామని ఆయన తెలిపారు. అలాగే ఇంకా 600 ఖాళీలు ఉన్నాయన్నారు. త్వరలో వీటిని భర్తీ చేస్తామని తెలిపారు. లీగల్ సమస్యలు రాకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి..వచ్చే ఏడాది ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
వాస్తవానికి గత వైసీపీ సర్కార్ ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను సవరించి అదనపు పోస్టులతో మెగా డీఎస్సీని కూటమి సర్కార్ ప్రకటించింది. కానీ దాని షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ గానీ ఇప్పటివరకూ రాలేేదు. దీంతో అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైన సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకూ దాన్ని ఆపాలని మందకృష్ణ మాదిగ సీఎం చంద్రబాబును కలిసి కోరారు. దీంతో ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. తాజాగా మంత్రి లోకేష్ మాటల్ని బట్టి చూస్తుంటే వచ్చే ఏడాది డీఎస్సీ పరీక్షలు ఉండబోతున్నాయి.







