రైలు ప్రయాణికులకు శుభవార్త..
* కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్తో తత్కాల్ బుకింగ్ మరింత వేగం.
ఢిల్లీ, మహా.
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) శుభవార్త అందించింది. తత్కాల్ టికెట్ల బుకింగ్ను మరింత వేగవంతంగా, సులభంగా నిర్వహించేందుకు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానుంది. తరచూ ఎదురవుతున్న సర్వర్ సమస్యలు, బుకింగ్ ఆలస్యం, చెల్లింపుల అంతరాయాలకు పరిష్కారం చూపేలా ఈ వెబ్సైట్ను అభివృద్ధి చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు, ప్రయాణికుల నుంచి వచ్చిన సూచనలు, ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ఐఆర్సీటీసీ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ అప్గ్రేడ్ చేపట్టినట్లు పేర్కొన్నారు.
కొత్త వెబ్సైట్లో తత్కాల్ టికెట్ బుకింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. ప్రస్తుతం నిమిషానికి సుమారు 32 వేల టికెట్లను మాత్రమే ప్రాసెస్ చేస్తున్న వ్యవస్థను అప్గ్రేడ్ చేసి, ఒకే నిమిషంలో 1.5 లక్షలకు పైగా టికెట్ బుకింగ్లను నిర్వహించే సామర్థ్యాన్ని కల్పించారు. దీంతో తత్కాల్ ప్రారంభమైన తొలి నిమిషాల్లో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఏర్పడనుంది.
ప్రయాణికుల ప్రశ్నలకు స్పందించే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచారు. ప్రస్తుతం నిమిషానికి నాలుగు లక్షల ఎంక్వైరీలను మాత్రమే నిర్వహిస్తున్న వ్యవస్థను, కొత్త అప్గ్రేడ్ ద్వారా నిమిషానికి 40 లక్షల ఎంక్వైరీలను నిర్వహించే స్థాయికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. దీంతో సీట్ల లభ్యత తెలుసుకోవడం, రైళ్ల వివరాలు పరిశీలించడం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది.
తత్కాల్ బుకింగ్ సమయంలో ప్రయాణికులను ఇబ్బంది పెట్టే పాప్అప్ ప్రకటనలు, పదేపదే వచ్చే క్యాప్చా ధృవీకరణలను గణనీయంగా తగ్గించారు. బుకింగ్ ప్రక్రియను మరింత సరళీకరించడం ద్వారా తక్కువ సమయంలో టికెట్ను పూర్తి చేసుకునే వీలు కల్పించారు. అలాగే స్లీపర్, తృతీయ ఏసీ, ద్వితీయ ఏసీ తదితర అన్ని తరగతుల సీట్ల లభ్యతను ఒకే తెరపై చూసే విధంగా యూనిఫైడ్ వ్యూ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫేర్ క్యాలెండర్ సదుపాయాన్ని కూడా కొత్త వెబ్సైట్లో ప్రవేశపెడుతున్నారు. వివిధ తేదీల్లో టికెట్ ధరలను ముందుగానే పోల్చుకుని అనువైన తేదీని ఎంపిక చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. బుకింగ్ సమయంలోనే తమకు నచ్చిన సీటు లేదా బెర్త్ను ఎంచుకునే సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు.
ప్రాంతీయ భాషలకు మరింత ప్రాధాన్యం ఇస్తూ బహుభాషా సేవలను విస్తరించనున్నట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. అలాగే దివ్యాంగులు, విద్యార్థులు, రోగులు పొందే టికెట్ రాయితీలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువచ్చి దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయనున్నారు.
కొత్త వెబ్సైట్ లేదా దాని బీటా వెర్షన్ను జూలై 15న ప్రారంభించే ప్రణాళిక ఉన్నప్పటికీ, బ్యాకెండ్ వ్యవస్థల అప్గ్రేడ్ పనులు కొనసాగుతున్నందున అధికారికంగా ఆగస్టు రెండో వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ అప్గ్రేడ్ పూర్తయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైలు ప్రయాణికులకు వేగవంతమైన, అంతరాయం లేని టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.







