- నేడు విక్రమ్-1 చారిత్రాత్మక ప్రయోగం.
- అంతరిక్షంలోకి ప్రధాని మోదీ చేతిరాత ‘వందే మాతరం’ సందేశం
హైదరాబాద్, మహా.
భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక అధ్యాయానికి శనివారం తెరలేవనుంది. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ‘విక్రమ్-1’ ఆర్బిటల్ రాకెట్ను శనివారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని చారిత్రాత్మక ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్నారు. భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ స్వదేశీ సాంకేతికతతో పూర్తిస్థాయి ఆర్బిటల్ రాకెట్ను అభివృద్ధి చేసి భూ కక్ష్యలోకి పంపేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం కావడంతో ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మిషన్ విజయవంతమైతే భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల సామర్థ్యానికి ఇది ఒక కొత్త మైలురాయిగా నిలవనుంది.
‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపడుతున్న ఈ తొలి టెస్ట్ ఫ్లైట్కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్రయోగంలో పలు సాంకేతిక ప్రదర్శన పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చేతితో రాసిన ‘వందే మాతరం’ సందేశంతో కూడిన పోస్ట్కార్డ్ను కూడా అంతరిక్షంలోకి పంపనున్నారు. భారత అంతరిక్ష చరిత్రలో ఇది అరుదైన ఘట్టంగా నిలవనుంది. దీనితో పాటు స్కైరూట్ బృందం, పెట్టుబడిదారులు, పాలసీ మేకర్లు, సంస్థ శ్రేయోభిలాషులు రాసిన చేతిరాత సందేశాలను కూడా ఈ మిషన్ ద్వారా కక్ష్యలోకి పంపుతున్నారు. దేశీయ సాంకేతిక ప్రతిభతో పాటు జాతీయ భావోద్వేగాన్ని కూడా ఈ ప్రయోగం ప్రపంచానికి చాటనుందని సంస్థ భావిస్తోంది.
ఈ మిషన్లో దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన పలు సాంకేతిక ప్రదర్శన పేలోడ్లు చోటు దక్కించుకున్నాయి. గ్రహా స్పేస్ అభివృద్ధి చేసిన ‘సోలార్స్ S3’ ఉపగ్రహం, కాస్మోసర్వ్ స్పేస్ రూపొందించిన ‘రోబోటిక్ ఆర్మ్ ఎంబ్రేస్’, జర్మనీకి చెందిన డ్కబెడ్ సాంకేతిక ప్రదర్శన, స్కైరూట్కు చెందిన ‘స్కోప్’ ఉపగ్రహం, బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ సంస్థ ప్రయోగశాలలో తయారుచేసిన ‘డైమండ్ లోటస్’, అలాగే 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన సూక్ష్మ రాకెట్ కళాఖండం కూడా ఈ ప్రయోగంలో అంతరిక్ష యాత్ర చేయనున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఈ మిషన్ నిలవనుంది.
సాంకేతికంగా విక్రమ్-1 రాకెట్ అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. మూడు ఘన ఇంధన దశలు, ఒక ద్రవ కక్ష్య సర్దుబాటు మాడ్యూల్తో రూపొందించిన ఈ రాకెట్ పూర్తిగా కార్బన్-కాంపోజిట్ పదార్థంతో నిర్మించబడిన భారత తొలి ఆర్బిటల్ రాకెట్గా గుర్తింపు పొందింది. ఉక్కుతో పోలిస్తే ఐదు రెట్లు తక్కువ బరువు కలిగిన ఈ నిర్మాణం రాకెట్ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చనుంది. అంతేకాకుండా భారత్లోనే తొలిసారిగా 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో తయారైన మెటల్ రాకెట్ ఇంజిన్లను ఇందులో వినియోగించారు. ఈ రాకెట్ 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లోకి గరిష్ఠంగా 350 కిలోగ్రాముల పేలోడ్ను ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉండగా, ఒకేసారి బహుళ ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ను కూడా అమర్చారు.
ఇప్పటికే 2022లో ‘విక్రమ్-ఎస్’ సబ్-ఆర్బిటల్ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన స్కైరూట్ ఏరోస్పేస్, ఇప్పుడు పూర్తిస్థాయి ఆర్బిటల్ మిషన్తో మరో భారీ అడుగు వేయబోతోంది. ఉపకక్ష్య ప్రయోగాల నుంచి పూర్తి స్థాయి ఉపగ్రహ ప్రయోగాల దిశగా సంస్థ సాగిస్తున్న ఈ ప్రయాణం భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ అభివృద్ధికి కీలక మలుపుగా మారనుంది. విక్రమ్-1 విజయవంతమైతే ప్రపంచ కమర్షియల్ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో భారత స్థానం మరింత బలపడటంతో పాటు, చిన్న ఉపగ్రహాల ప్రయోగ రంగంలో భారత్కు విశేష అవకాశాలు లభించే అవకాశముందని అంతరిక్ష రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇస్రో సృష్టించిన బలమైన పునాదులపై దేశీయ ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. విక్రమ్-1 విజయవంతమైతే భారత ప్రైవేట్ స్పేస్ ఎకోసిస్టమ్కు ఇది ఒక చారిత్రాత్మక విజయంగా నిలవడమే కాకుండా, ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తికి అంతరిక్షంలో మరో గొప్ప విజయగాథగా నిలిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.








