Mahaa Daily Exclusive

  భారత రైతాంగానికి మోదీ ప్రభుత్వ వ్యూహాత్మక వరం!

Share

*భారత రైతాంగానికి మోదీ ప్రభుత్వ వ్యూహాత్మక వరం!
ప్రపంచ స్థాయి అవకాశాల దిశగా ‘భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌’పై వాస్తవిక, సాంకేతిక విశ్లేషణ.*

(శివ కుమార్ గనివాడ, సీనియర్ వ్యవసాయ, వాణిజ్య నిపుణులు,9951715215 )

వాణిజ్య ఒప్పందాల (ట్రేడ్ అగ్రిమెంట్స్) గురించి వినగానే విదేశీ ఉత్పత్తులతో మన దేశీయ మార్కెట్ కుప్పకూలుతుందనే అపోహలు తరచుగా వ్యక్తమవుతుంటాయి. కానీ, అంతర్జాతీయ వాణిజ్యాన్ని కేవలం భయంతో కాకుండా, సాంకేతిక, వ్యూహాత్మక కోణంలో చూసినప్పుడు వాస్తవాలు వేరుగా కనిపిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అమెరికా వంటి దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్.టి.ఏ లు/బి.టి.ఏ లు) మార్కెట్ యాక్సెస్‌ను పెంచడానికి, నేరుగా రైతులకు, పరిశ్రమలకు ప్రయోజనాలను సృష్టించడానికి పకడ్బందీగా రూపొందించబడ్డాయి. ఇవి మన వ్యవసాయ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అద్భుత అవకాశాలు. భారత రైతుల ప్రయోజనాలను రక్షిస్తూనే, గ్లోబల్ మార్కెట్లను వశం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న వాణిజ్య, సాంకేతిక వ్యూహాలు (ట్రేడ్ మెకానిజమ్స్) ఎంతో సమర్థవంతంగా ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం అనగానే విదేశీ సరుకులకు తలుపులు బార్లా తెరిచినట్లు కాదు. మునుపటి వాణిజ్య ఒప్పందాలలో భారతదేశ విధానానికి అనుగుణంగా, వ్యవసాయ మార్కెట్ యాక్సెస్ ఉత్పత్తుల సున్నితత్వం (ప్రొడక్ట్ సెన్సిటివిటీ) ఆధారంగా క్రమాంకన (కాలిబ్రేటెడ్) మార్కెట్ ఓపెనింగ్ ద్వారా ప్రభుత్వం కట్టుదిట్టమైన సాంకేతిక భద్రతా కవచాలతో (టెక్నికల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఫార్మర్స్) అత్యంత కఠినమైన విధానాలతో అమలు చేస్తోంది. మన దేశ ఆహార భద్రతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అత్యంత సున్నితమైన వ్యవసాయ రంగాలను మినహాయింపు వర్గం (ఎగ్జెంప్షన్ కేటగిరీ) కింద పూర్తిగా రక్షించారు. దీనిలో పాడి పరిశ్రమ (డైరీ), పౌల్ట్రీ, మాంసం, గోధుమ, వరి, మొక్కజొన్న లాంటి ప్రధాన ధాన్యాలతో పాటు, జొన్న, సజ్జ, రాగి, కోడో మిల్లెట్, అమరాంత్ వంటి చిరుధాన్యాలు, అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, చెర్రీలు, సిట్రస్ పండ్లు, పచ్చి బఠానీలు, కాబూలీ శనగలు, పెసలు వంటి పప్పుధాన్యాలు, నూనెగింజలు, పశుగ్రాసం ఉత్పత్తులు, వేరుశెనగ, తేనె, మాల్ట్, ఆల్కహాల్ లేని పానీయాలు, పిండి, స్టార్చ్, ముఖ్యమైన నూనెలు, ఇంధనం కోసం ఇథనాల్ మరియు పొగాకును వ్యవసాయ ‘నెగెటివ్ లిస్ట్’ లో ఉంచారు. అమెరికాకు చెందిన జన్యుమార్పిడి (జెనిటికల్లీ మాడిఫైడ్ – జి.ఎమ్) సోయామీల్, ఆహార ఉత్పత్తులకు కూడా కఠిన నిషేధం విధించారు. అంటే వీటికి ఎలాంటి పన్ను రాయితీలు (టారిఫ్ కన్సెషన్లు) ఉండవు. దీనివల్ల మన చిన్న రైతుల మార్కెట్‌కు ఎలాంటి ముప్పు ఉండదు. కొన్ని సున్నితమైన వస్తువులైన పొట్టుతో ఉన్న బాదం, వాల్‌నట్‌లు, పిస్తాపప్పులు, కాయధాన్యాలు (లెంటిల్స్) మొదలైన వాటి దిగుమతులపై ప్రభుత్వం పరిమితులు (సేఫ్ గార్డ్స్) విధించింది. వీటిని టారిఫ్ రేట్ కోటాల (టి.ఆర్.క్యూ) కింద సరళీకృతం చేసి, ఒక నిర్దిష్ట పరిమాణం వరకు మాత్రమే తగ్గిన పన్నుతో అనుమతిస్తారు, ఆ పరిమితి దాటితే భారీ సుంకాలు విధిస్తారు. విదేశాల నుండి నాసిరకం లేదా అత్యంత చౌకబారు ఉత్పత్తులు (డంపింగ్) మన మార్కెట్లోకి రాకుండా, విదేశీ సరుకుల దిగుమతులపై కనీస దిగుమతి ధరను (మినిమమ్ ఇంపోర్ట్ ప్రైస్ – ఎమ్.ఐ.పి) నిర్దేశిస్తారు. మొక్కల భాగాలు, ఆలివ్‌లు, పైరెత్రమ్, ఆయిల్ కేక్‌లు వంటి ఎంచుకున్న సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం, కొంత సుంకం రక్షణ కొనసాగేలా సుంకం తగ్గింపు (టారిఫ్ రిడక్షన్) వర్తించబడింది. ఇతర ఎఫ్.టి.ఏ ల విధానానికి అనుగుణంగా కనీస దిగుమతి ధర ఆధారిత సూత్రీకరణలతో పాటుగా ఆల్కహాలిక్ పానీయాలు కూడా ఈ సుంకం తగ్గింపులో చేర్చారు. భారతదేశ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ ఉపయోగించే కొన్ని ఇంటర్మీడియట్ ఉత్పత్తులైన కొబ్బరి నూనె, ఆముదం, పత్తి గింజల నూనె, అల్బుమిన్స్, మార్పు చేయబడిన పిండి పదార్థాలు (మాడిఫైడ్ స్టార్చెస్), లార్డ్, స్టీరిన్, పెప్టోన్స్ కోసం పదేళ్ల వరకు దశలవారీగా టారిఫ్ తొలగింపు (ఫేజ్డ్ ఎలిమినేషన్) స్వీకరించబడింది. ఈ సమయం దేశీయ వాటాదారులకు తగిన సర్దుబాటు స్థలాన్ని అందిస్తుంది. ఇతర ఎఫ్.టి.ఏ ల కింద ఇప్పటికే సరళీకృతం చేయబడిన ఎంపిక చేసిన నాన్-సెన్సిటివ్ ఉత్పత్తులకు మాత్రమే తక్షణ సుంకం తొలగింపు (ఇమ్మీడియట్ డ్యూటీ ఎలిమినేషన్) ఆఫర్ చేయబడింది. ఈ ఒప్పందాల వల్ల మన రైతులకు నష్టం జరుగుతుందని కొందరు అపోహ పడుతున్నారు కానీ, ఈ వాణిజ్య ఒప్పందాలలోని ఎగుమతులకు రెడ్ కార్పెట్ (ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ అండ్ జీరో డ్యూటీ యాక్సెస్) అతిపెద్ద సానుకూల అంశం. మన దేశీయ ఉత్పత్తులకు ప్రపంచ అగ్ర దేశాల్లో లభించే ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుంటే, 1.36 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై అమెరికా ఎటువంటి అదనపు సుంకాన్ని విధించదు. ఈ సున్నా సుంకం (జీరో డ్యూటీ) యాక్సెస్ ద్వారా లబ్ధి పొందే ఉత్పత్తులలో పసుపు , మిర్చి, ఇతర సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ మరియు వాటి ఎక్స్ట్రాక్షన్స్, కొబ్బరి, కొబ్బరి నూనె, వెజిటబుల్ వాక్స్, పోకచెక్కలు, బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, చెస్ట్‌నట్స్ వంటి గింజలు, అవకాడోలు, అరటిపండ్లు, జామ, మామిడి, కివీస్, బొప్పాయి, పైనాపిల్, షిటేక్, పుట్టగొడుగులతో సహా పండ్లు, కూరగాయలు, బార్లీ, కానరీ విత్తనాల వంటి తృణధాన్యాలు, బేకరీ ఉత్పత్తులు, కోకో, కోకో ఉత్పత్తులు, నువ్వులు, గసగసాలు, అలాగే పండ్ల గుజ్జు, రసాలు, జామ్‌ల వంటి ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో అనిశ్చితిని నివారించడానికి 1.035 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులకు సున్నా పరస్పర సుంకం (జీరో రెసిప్రోకల్ టారిఫ్) హామీ ఇవ్వబడింది, ఇది భారతీయ రైతులకు, ఎగుమతిదారులకు స్థిరత్వాన్ని, అంచనా సామర్థ్యాన్ని అందిస్తుంది. దీనివల్ల విదేశాల్లో మన సరుకులకు గిరాకీ పెరిగి, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర లభిస్తుంది. పారిశ్రామిక, తయారీ రంగంలో సుంకాల తగ్గింపు ద్వారా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. మన రైతులు కేవలం స్థానిక అవసరాలకే కాకుండా, ప్రపంచ అవసరాలను తీర్చే స్థాయికి ఎదగాలంటే కొన్ని అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలు పాటించడం గ్లోబల్ వాల్యూ చైన్స్ (జి.వి.సి లు) లో కీలకం. విదేశాలకు ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఖచ్చితమైన ఆరోగ్య మరియు పరిశుభ్రత ప్రమాణాలను (శానిటరీ అండ్ ఫైటో శానిటరీ – ఎస్.పి.ఎస్) అలాగే సాంకేతిక ప్రమాణాలను (టెక్నికల్ బ్యారియర్స్ టూ ట్రేడ్ – టి.బి.టి) పాటించాలి. పన్ను-యేతర అడ్డంకులను (నాన్-టారిఫ్ బారియర్స్ – ఎన్.టి.బి లు) నివారించడానికి, మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరచడానికి ప్రభుత్వం నిరంతరం భాగస్వామ్య దేశాలతో ఈ సాంకేతిక ప్రమాణాలపై చర్చలు జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) ద్వారా ఈ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలపై రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్.పి.ఓ లకు) సాంకేతిక మద్దతు అందిస్తూ వారిని గ్లోబల్ సప్లయర్లుగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి తోడుగా, రైతులను మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఇ.పి.ఎమ్) కింద 2025–26 ఆర్థిక సంవత్సరం నుండి 2030–31 ఆర్థిక సంవత్సరం కాలానికి 25,060 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో వాణిజ్య ఆర్థిక మద్దతు, ప్యాకేజింగ్ మరియు లాజిస్టిక్స్ మద్దతు అందించబడుతుంది. అలాగే డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్‌పోర్ట్ హబ్స్ (డి.ఇ.హెచ్) చొరవ కింద ప్రతి జిల్లాలో ఎగుమతి సామర్థ్యం ఉన్న 3 నుండి 5 ఉత్పత్తులను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహిస్తోంది. పంటను నేరుగా అమ్మేయకుండా, ఫార్మ్-గేట్ (పొలం దగ్గరే) ప్రాసెసింగ్ చేసి గ్లోబల్ వాల్యూ చైన్స్ (జి.వి.సి లు) లో అనుసంధానంతో విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలతో వ్యాపారం పెరిగినప్పుడు, మన ఊళ్లలో కూడా ఆధునిక కోల్డ్ స్టోరేజీలు (శీతల గిడ్డంగులు), ప్యాకేజింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వేగంగా వస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులకు అమెరికా వంటి దేశాల్లో పన్ను రాయితీలు దక్కడం వల్ల వ్యవసాయ ఆధారిత మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎం.ఎస్.ఎం.ఈ లు) మరింత బలపడతాయి. వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం అనేది మన వ్యవసాయ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక గొప్ప ముందడుగు. మోదీ ప్రభుత్వ ఈ నిర్ణయం, మన దేశీయ మార్కెట్‌ను భద్రంగా కాపాడుతూనే, ప్రపంచ మార్కెట్లలో మన రైతులు ఆత్మవిశ్వాసంతో వ్యాపారం చేసుకునేలా చేస్తోంది. మనం పాత పద్ధతులు, అనవసర భయాలకే పరిమితం కాకుండా, ఈ ప్రపంచ స్థాయి అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకోవాలి. ఇదే స్వావలంబన (ఆత్మనిర్భర్) మరియు అభివృద్ధి చెందిన భారత్‌కు (వికసిత్ భారత్) బలమైన పునాది వేస్తుంది.