Mahaa Daily Exclusive

  లోక్ సభకు లోకల్ సభ తేడా తెలియని రాహుల్ గాంధీ…

Share

  • లోక్ సభకు లోకల్ సభ తేడా తెలియని రాహుల్ గాంధీ
  • ప్రతిపక్ష నేత హోదాకే అవమానంగా రాహుల్ ప్రసంగం
  • తెలంగాణ యువత బలిదానాలకు, విద్యార్థుల రోదనకు కాంగ్రెస్ పాపమే కారణం
  • విదేశీ విహారాల రహస్యాలను, పౌరసత్వ వివాదాన్ని దేశ ప్రజలకు వెంటనే విప్పి చెప్పాలి
  • మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్

హైదరాబాద్, మహా : లోకల్ సభలో ఏం మాట్లాడాలో, అత్యున్నతమైన లోక్ సభలో ఏం మాట్లాడాలో కనీస అవగాహన, జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడా అని భారతీయులంతా ముక్కు మీద వేలేసుకుని తలదించుకునేలా రాహుల్ గాంధీ వ్యవహరించారని బిజెపి సీనియర్ నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ పల్నాటి వెంకట్ రెడ్డితో కలసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సభా గౌరవాన్ని మంటగలిపేలా రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడిన పదాలు, అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు ఆయన అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు. గతంలో పార్లమెంట్‌లో కనుసైగలు చేయడం, ఫ్లయింగ్ కిస్‌లు ఇవ్వడం, చిలిపి చేష్టలు చేయడం రాహుల్‌కు అలవాటుగా మారిందని, ఆయన మానసిక స్థితి సరిగ్గా లేకే “సభను ఆర్డర్‌లో పెట్టు” అంటూ అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ప్రసంగంలో పాయింట్ లేకపోగా, దేశ ప్రజలను తీవ్రంగా డిసపాయింట్ చేశారని విమర్శించారు.

గతంలో కోర్టుకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పి ఒక కేసులో బయటపడిన రాహుల్ గాంధీ, మరో పరువు నష్టం కేసులో సీటును కూడా కోల్పోయి, స్టేపై తాత్కాలికంగా కొనసాగుతున్నారని గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ ఆర్థిక కుంభకోణంలో తల్లి, కొడుకు ఇద్దరూ బెయిల్‌పై బయట తిరుగుతూ నీతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బెయిల్ రద్దయితే రాహుల్ గాంధీ పోవాల్సింది జైలుకేనని స్పష్టం చేశారు.

యువతకు ప్రతీక అని చెప్పుకునే రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్ చేసిన జాప్యం వల్ల 1,200 మంది అమాయక విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయక 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఎన్నికల్లో జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను మోసగించిన నెంబర్ వన్ దగాకోరు రాహుల్ గాంధీ అని నిలదీశారు. కర్ణాటకలో ప్రశ్నాపత్రాల లీకేజీలు, గతంలో కాంగ్రెస్ హయాంలో సీబీఎస్‌ఈ, జేఈఈ, ఎయిమ్స్ పేపర్ల లీకేజీలతో కాంగ్రెస్ నాయకులు ‘లీక్ వీరులు’గా మిగిలిపోయారని విమర్శించారు.

రాహుల్ గాంధీ పౌరసత్వంపై బ్రిటన్ సిటిజన్ షిప్ వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని, దేశ సమగ్రత, సైన్యం ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా విదేశీ గడ్డపై చిల్లర మాటలు మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు. అసలు దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ విదేశాలకు ఎందుకు పారిపోతారని ప్రశ్నించారు. ఇప్పటివరకు 207 సార్లు ఒకే విదేశీ ప్రాంతానికి వెళ్లి, అక్కడి మహిళలతో, పిల్లలతో విహారయాత్రలు, నౌకాయానాలు చేయడం వెనుక రహస్యమేంటో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంలో ఇలాంటి పనులు చేసేవారిని ‘ఇడియట్’ అంటారని, ప్రధాని మరియు హోంమంత్రి పట్ల దురుసుగా ప్రవర్తించిన రాహుల్ గాంధీకి రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.