Mahaa Daily Exclusive

  తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు శిక్ష….

Share

తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు శిక్ష.
• లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు గోవా బెంచ్ సంచలన తీర్పు.
ఢిల్లీ, మహా.

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు 2013లో నమోదైన లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు గోవా బెంచ్ పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.5 లక్షల జరిమానా కూడా విధిస్తూ, రెండు వారాల్లో సంబంధిత కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును రద్దు చేసిన హైకోర్టు, తాజాగా శిక్షను ఖరారు చేసింది.

2013లో గోవాలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా హోటల్ లిఫ్ట్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని తన జూనియర్ సహోద్యోగిని చేసిన ఫిర్యాదు ఆధారంగా తరుణ్ తేజ్‌పాల్‌పై కేసు నమోదైంది. అదే ఏడాది నవంబర్‌లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, కేసు విచారణ అనంతరం 2021లో గోవా ట్రయల్ కోర్టు సాక్ష్యాధారాలు సరిపోవని పేర్కొంటూ నిర్దోషిగా ప్రకటించింది.

అయితే ట్రయల్ కోర్టు తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాలు చేసింది. అప్పీల్‌ను విచారించిన హైకోర్టు, ట్రయల్ కోర్టు తీర్పులో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ దానిని కొట్టివేసింది. బాధితురాలి వాంగ్మూలం, కేసులోని ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించి, పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది.

తీర్పు వెలువడిన అనంతరం తరుణ్ తేజ్‌పాల్ స్పందిస్తూ, తాను ఎలాంటి నేరం చేయలేదని, ఈ కేసులో తానే బాధితుడినని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుతో తాను ఏకీభవించడం లేదని, న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. రెండు వారాల్లో లొంగిపోవాలన్న హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని ఆయన వెల్లడించారు.

ఈ తీర్పుతో దాదాపు 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంచలన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ట్రయల్ కోర్టు నిర్దోషి తీర్పును హైకోర్టు రద్దు చేసి శిక్ష విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.