మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల పట్ల కొంత నిర్లక్ష్యం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు జరిగింది ఒక లెక్కా ..ఇకపై జరిగేది మరో లెక్కా అంటూ కార్యకర్తల్లో అంటూ జగన్ ధైర్యం నింపారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానంటూ ఆయన హామీ ఇచ్చారు. బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి వారంలో మూడు రోజులు ఒక పార్లమెంటు పరిధిలో విడిది చేసి, ప్రతీరోజు రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటానన్నారు. మండల స్థాయి నుంచి బూత్ కమిటీల వరకు పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుందని ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేశారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. రాజకీయాల్లో ఉండే నాయకులకు విశ్వసనీయత, వ్యక్తిత్వం ఉండాలన్నారు. అలాంటి వారికే ప్రజల్లో విలువ ఉంటుందని పేర్కొన్నారు.








