ఆదిలాబాద్, మహా
ప్రజానాయకుడిగా వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్ , కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ముఖ్య మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంతో పాటు నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను స్మరించుకున్నారు.నాడు ఆ మహనీయుడు ప్రవేశ పెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుని అనంతర ప్రభుత్వాలు వాటిని కొనసాగిస్తున్నాయన్నారు.ఆదిలాబాద్ కు రిమ్స్ తో పాటు పలు ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత వైఎస్ ఆర్ దేనని గుర్తు చేసుకున్నారు.ఆయన పాలనలో నిస్వార్థత, పేదలకు మంచి చేయాలన్న సంకల్పబలంతో ప్రజాసేవలో అనేక సంస్కరణలతో నూతన అధ్యాయాన్ని లిఖించిన మహానేత అని కొనియాడారు. రైతుల సంక్షేమం, మహిళాభ్యున్నతి ,విద్య, వైద్యారోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులతో ప్రజల మేలుకోరి పాలన సాగించిన మహనీయుడని అన్నారు. ఆయన ఆలోచనా విధానాలు కార్యాచరణ రాష్ట్ర ప్రగతికి బీజం వేసాయని తెలిపారు. యావత్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను గర్వంతో స్మరించుకుంటుందని యావత్తు దేశం ప్రజా నాయకుడిగా గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, గిమ్మ సంతోష్ ,కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ జిల్లా అధ్యక్షులు సెడ్మాకి ఆనంద్ రావు, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, బండి దేవిదాస్ చారి,దాసరి ఆశన్న, ఎల్మ రామ్ రెడ్డి,సోమ ప్రశాంత్,మహేందర్,అశోక్, జాదవ్ శ్రవణ్ నాయక్,సంజయ్ రెడ్డి,నిమ్మల గౌతమ్ రెడ్డి, అంజద్ ఖాన్, తోఫిక్, పొచ్చన్న,అతిక్ ఉర్ రహమాన్, ఇర్ఫాన్, శ్రీలేఖ ఆదివాసీ, షబానా,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.








