ఆదిలాబాద్ మహా : ఒక బ్రాండ్ కు చెందిన నకిలీ డిటర్జెంట్ పౌడర్ బ్యాగులను పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రూపేష్ అగర్వాల్ అనే వ్యక్తి అమరావతి నుండి నకిలీ ఘడి డిటర్జెంట్ ను తీసుకువచ్చి ఆదిలాబాద్, మహారాష్ట్రలోని జివితి ప్రాంతానికి చెందిన వ్యాపారులకు అమ్ముతున్నాడన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాంసి బస్టాండ్ ప్రాంతం నందు ఆదిలాబాద్ టూ టౌన్ ఎస్సై విష్ణు ప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది బొలెరో వాహనం తనిఖీ చేయగా అందులో 60 బ్యాగులలో దాదాపు 15 క్వింటాళ్ల నకిలీ డిటర్జెంట్ ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నట్టు డిఎస్పి చెప్పారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎలాంటి నకిలీవి చలామణిలో ఉన్న తగిన సమాచారాన్ని పోలీసు వ్యవస్థకు అందజేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. కేసు నమోదైన నలుగురిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏ ఫోర్ నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, ఎస్సై విష్ణు ప్రకాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







