దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోటాను వర్గీకరించడానికి మద్దతుగా ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ వెలువరించిన చారిత్రక తీర్పును దళిత నేత మందకృష్ణ మాదిగ స్వాగతించారు. ఇదే అంశంపై దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఆయన ఇవాళ తీర్పు రాగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు.. తమ 30 ఏళ్ల పోరాటం ఫలించడంపై మందకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందన్నారు. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని చొరవ తీసుకున్నారని అభినందించారు. అమిత్షా, వెంకయ్యనాయుడు, కిషన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా మద్దతు పలికిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. రిజర్వేషన్ల వ్యవస్ధలో ఇప్పుడు రెండో అడుగు పడిందని ఆయన అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమన్నారు. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే..ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను మందకృష్ణ మాదిగ కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.








