Mahaa Daily Exclusive

  సర్వీస్ ప్రొవైడర్లపై రాన్సమ్‌వేర్ దాడి.. 300 బ్యాంకులపై ఎఫెక్ట్

Share

అరచేతిలో టెక్నాలజీ ఏమో.. రోజురోజుకూ సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయి. దీని బారిన చాలామంది పడుతున్నారు. తాజాగా భారత్‌లోని చిన్న బ్యాంకులకు సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న సీ-ఎడ్జ్ టెక్నాలజీపై రాన్సమ్‌వేర్ దాడి చేసినట్టు తెలుస్తోంది. దీని ప్రభావం దాదాపు 300 చిన్న బ్యాంకులపై పడినట్టు వార్తలు వస్తున్నాయి.

 

భారత్‌లో చిన్న బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా సీ-ఎడ్జ్ ఉంది. ఈ సర్వీస్ ప్రొవైడర్‌పై రాన్సమ్‌ వేర్ దాడి జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీని ఫలితంగా దేశంలో దాదాపు 300 బ్యాంకులపై పడింది. దీనికారణంగా ఏటీఎంల నుంచి నగదు తీసుకోలేకపోయారు. యూపీఐ ద్వారా సేవలను వినియోగించు కోలేకపోయారు. ఈ నేపథ్యంలో చెల్లింపుల వ్యవస్థలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చినట్టు అందులోని సారాంశం. ఈ వ్యవహారంపై ఇటు సీ-ఎడ్జ్ టెక్నాలజీ ప్రొవైడర్, అటు ఆర్‌బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

 

బ్యాంకులపై సైబర్ దాడి జరిగే ఛాన్స్ ఉందని ఆర్‌బీఐ, భద్రతా విభాగాలు కొన్ని రోజుల కిందట వివిధ బ్యాంకులను హెచ్చరించాయి. కాకపోతే ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్‌పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. భారత్‌లో ప్రస్తుతం 1500 కో-ఆపరేటివ్, ప్రాంతీయ బ్యాంకులు ప్రజలకు సేవలందిస్తున్నాయి. వీటిలో కొన్నింటిపై దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తోంది ఎన్‌పీసీఐ.

 

భారత్‌లో చెల్లింపుల వ్యవస్థను నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సమస్య మరింత జఠిలం కాకుండా 300 చిన్న బ్యాంకులకు రిటైల్ పేమెంట్ వ్యవస్థ లను తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేసినట్టు పేర్కొంది. ఇండియా డిజిటల్ చెల్లింపుల్లో ఆయా బ్యాంకుల వాటా కేవలం 0.5 శాతంగా తెలుస్తోంది.

 

నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దిలీప్ సంఘాని నోరువిప్పారు. దేశంలో దాదాపు 300 బ్యాంకులు, గుజరాత్‌లోని 17 జిల్లా సహకార బ్యాంకులు, సీ-ఎడ్జ్‌ని ఉపయోగిస్తున్నాయని, రెండు మూడురోజులుగా సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఆర్‌టీజీఎస్, యూపీఐ వంటి అన్ని ఆన్‌లైన్ లావాదేవీలపై ప్రభావం ఉంది. వినియోగదారులు ఎవరికైనా మనీ ఆన్‌లైన్‌లో పంపిస్తే వారి ఖాతా నుంచి డిబెట్ అవుతుందని, అవతలివారి ఖాతాలో ఆ మొత్తం జమకావడం లేదన్నారు.

Latest