ఖమ్మం, సెప్టెంబర్-14, మహా:
జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తవడానికి మిగులు భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో జాతీయ రహదారుల నిర్మాణ పురోగతి పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఖమ్మం-దేవరపల్లి, నాగపూర్-అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం-దేవరపల్లి రహదారికి ధాంసలాపురం వద్ద ఎంట్రీ, ఎక్జిట్ పాయింట్ కొరకు 6.22 ఎకరాల భూసేకరణ చేయాలన్నారు. ఇందులో 3.16 ఎకరాలకు ఇప్పటికే అవార్డ్ పాస్ చేసినట్లు, మిగతా 3.06 ఎకరాలకు భూసేకరణ కు చర్యలు వేగవంతం చేయాలన్నారు.
మేజర్ బ్రిడ్జి, వియుపి లు ఈ నవంబర్ లోగా, ఆర్ఓబి డిసెంబర్ లోగా పూర్తి చేయాలన్నారు. కొదుమూరు వద్ద 400 కెవి ఇహెచ్ టి షిప్టింగ్ పనులు రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు సమావేశమై పూర్తిచేయాలన్నారు
నాగపూర్-అమరావతి ప్యాకేజి-1 మరియు 2 భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ లోగా పరిహార చెల్లింపులు పూర్తిచేసి, భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఎన్ హెచ్ఏఐ పిడి లు రామాంజనేయ రెడ్డి, దివ్య, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






