హైదరాబాద్, మహా: తెలంగాణను ఎకో టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎకో టూరిజం కోసం గుర్తించిన సైట్లలో సమగ్రంగా అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో ఒక ప్రత్యేక ఎకో- టూరిజం హబ్గా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ టూరిజం పాలసీలో అంశాలను మనం ఎంత వరకు ఉపయోగించి ఎకో టూరిజాన్ని మన రాష్ట్రంలో డెవలప్ చెయ్యవచ్చన్న విషయాలను మంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ స్క్రీనింగ్ కమిటీ భేటీలో అనంతగిరి(వికారాబాద్), కనకగిరి(ఖమ్మం), నందిపేట్(నిజామాబాద్), మన్ననూర్ జంగల్ రిసార్టు(నాగర్ కర్నూల్), ముచ్చెర్ల ఎకో పార్క్(నల్గొండ), వైజాగ్ కాలనీ(నల్గొండ), మంజీరా(సంగారెడ్డి), అమరగిరి(నాగర్ కర్నూల్) తదితర ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు అమలుపై సుదీర్ఘ చర్చ జరిగింది.






