- హరీశ్ రావు.. పనికి రాని మాటలొద్దు
- ఎవరి చెంప చెల్లు మంటదో.. ఎవరి గూబ గుయ్ మంటదో 11న చూద్దాం
- కేసీఆర్ లక్ష ఇండ్లు ఎక్కడ కట్టాడో చూపించాలి
- హరీశ్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్
హైదరాబాద్, మహా: మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు.. ఎవరి చెంప చెల్లు మంటదో, ఎవరి గూబ గుయ్ మంటదో నవంబర్ 11న తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ హైదరాబాద్లో లక్ష ఇండ్లు కట్టించారని, రేవంత్ రెడ్డి లక్ష ఇండ్లు కూల్చినట్లు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లక్ష ఇండ్లు ఎక్కడ కట్టాడో చూపించాలని సవాల్ విసిరారు. ఆ లక్ష మంది రోడ్డుపైకి వచ్చి చెప్పాలన్నారు. వర్షాకాలంలో హైదరాబాద్ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారన్నారు. హైదరాబాద్ను న్యూయార్క్ చేస్తా, విశ్వనగరం చేస్తానని చెప్పి మునిగిపోయే నగరంగా మార్చారని ఫైర్ అయ్యారు. నగరం వరదలో మునిగిపోతుంటే చెరువులో కట్టిన ఇళ్లను హైడ్రా కూల్చివేసిందని, నాలాలపైన ఆక్రమణలను తొలగించారని స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిబంధనలకు విరుద్దంగా చెరువుల పక్కన ఇళ్లు కడితే కొనడానికి ఎవరూ సిద్ధంగా లేరని, దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వచ్చాయని హరీశ్ రావు వేదికలపైన పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని, హుజూరాబాద్లో డబ్బులు పంచి గెలిచినట్లు జూబ్లీహిల్స్లో కూడా గెలవాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. నవీన్ యాదవ్ నామినేషన్తోనే కాంగ్రెస్ విజయం ఖాయమని తేలిపోవడంతో కేటీఆర్, హరీశ్ రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ మీద కాకుండా సెంటిమెంట్ మీద ఓట్లు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోందన్నారు. నవీన్ యాదవ్, కాంగ్రెస్ ప్రచారం అంతుచిక్కక బీఆర్ఎస్ నాయకులు గందరగోళంలో ఉన్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడారు.. పార్లమెంటు ఎన్నికల్లో గుండా సున్నా వచ్చింది.. కంటోన్మెంట్ ఉప ఎన్నిక చిత్తయ్యారు.. అని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందన్న భయంలో ఉన్నారని, మీ పార్టీ జెండా కట్టే వాళ్లు కూడా ఉండరనే నువ్వు, నీ బామ్మర్థి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు








