- గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్
- డైట్, అద్దె, మధ్యాహ్న భోజన బకాయిల విడుదల
- రూ. 163 కోట్లు వెంటనే చెల్లించాలని భట్టి విక్రమార్క ఆదేశాలు
- నిర్వాహకులు నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని సూచన
హైదరాబాద్, మహా: ఎస్సీ, మైనార్టీ గురుకులాల డైట్, అద్దె బకాయిలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బకాయిలు మొత్తం సుమారు రూ. 163 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ, గురుకులాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలకు సంబంధించిన డైట్, అద్దె, కాస్మోటిక్స్ బకాయిలకు సంబంధించిన రూ. 51.36 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని మైనారిటీ గురుకులాలు మైనార్టీ విద్యాసంస్థలకు సంబంధించిన డైట్, అద్దె బకాయిలు రూ. 47.61 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు.
నిర్దేశించిన మెనూ పూర్తిస్థాయిలో పాటించాలి..
అదేవిధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 63.92 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో, వైవిధ్యంతో కూడిన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశ్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురుకులాలు, వసతిగృహ విద్యార్థుల డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 పెంచిన విషయాన్ని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిర్వాహకులు నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పూర్తిస్థాయిలో పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అధికారులు నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం సందర్శించాలని, సమీక్షించాలని డిప్యూటీ సీఎం సూచించారు. అధికారుల సందర్శనకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు నిర్వాహకులు నివేదించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.








