- 2015 గ్రూప్ 2 వివాదం
- హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు
- అప్పీలుకు వెళ్ళాలని టీజీపీఎస్ సీ కీలక నిర్ణయం
హైదరాబాద్, మహా : పోటీ పరీక్షల నిర్వహణ గందరగోళంగా తయారయ్యింది. గత బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకేజీలు వంటి వివాదాలతో గ్రూప్ 1 పరీక్ష పలు మార్లు రద్దయిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ హైకోర్టు పదేళ్ల క్రితం అనగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ పరీక్ష నిర్వహణే చాలా గందరగోళంగా సాగింది. చాలా పరీక్ష కేంద్రాల్లో వైటనర్ వినియోగించారు. దీనిపై అప్పట్లోనే పెద్ద వివాదం రేగింది. తాజాగా కోర్టు కూడా మరోసారి వైట్నర్ అంశాన్ని ప్రస్తావిస్తూ గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ క్రమంలో దీనిపై అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. గురువారం చైర్మన్ బుర్ర వెంకటేశం అధ్యక్షతన కమిషన్ అత్యవసరంగా భేటీ అయింది. గ్రూపు–2 సెలెక్షన్ లిస్టు రద్దుతో తలెత్తిన పరిణామాలు, కోర్టు తీర్పులోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించుకుంది. అయితే గ్రూప్ 2 భర్తీకి సంబంధించి.. సుప్రీం కోర్టు దాకా వెళ్లివచ్చిన తర్వాతే ఫైనల్ రిజల్ట్ విడుదల చేశారని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ గ్రూప్ 2 అంశంపై తెలంగాణ హైకోర్టు కూడా తన తీర్పులో అనేకసార్లు టెక్నికల్ కమిటీ సిఫారసులను అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పాటు కమిషన్ అధికారులు కూడా పట్టించుకోలేదని పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో కమిషన్ అధికారులు అప్పటి టెక్నికల్ కమిటీ ఏ అంశాలను సిఫారసు చేసిందనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అలానే అప్పట్లో కమిషన్లో కీలకంగా వ్యవహరించిన వారితో ఇప్పుడున్న కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం మాట్లాడారని తెలుస్తోంది. ఈ పరీక్షకు సంబంధించి వైట్నర్ అంశమే వివాదానికి మూల కారణం. దీంతో 2015 గ్రూప్–2 ఎగ్జామ్ పార్ట్ బీలో సమాధాన పత్రం మీద వైట్నర్ వాడిన అభ్యర్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అప్పటి గ్రూప్ 2 నోటిషికేషన్కు సంబంధించి సుమారు 4.7 లక్షలకు పైగా క్యాండిడేట్స్ పరీక్ష రాశారు. వీరందరికీ సంబంధించి 22 లక్షల ఆన్సర్ షీట్లు (ఓఎంఆర్) పరిశీలించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే కొన్ని సెంటర్లలోనే చాలా మంది అభ్యర్థులు వైట్నర్ వినియోగించారు. దీంతో వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఈ అంశంపై కోర్టు ముందుకు అప్పీల్కు వెళ్లేటప్పుడు పూర్తి సమాచారం న్యాయస్థానికి సమర్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుత కమిషన్ సభ్యులు ఇప్పుడు ఈ పనిలో బిజీగా ఉన్నారు. వెళ్లేటప్పుడు కోర్టు ముందు పూర్తి సమాచారం ఉంచేందుకు కమిషన్ ఈ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అలానే 2015 గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది విధుల్లో చేరినవారు టీజీపీఎస్సీ అప్పీల్ కు వెళ్లాక కేసులో భాగస్వామ్యం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.








