- హైదరాబాద్కు ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ బూస్ట్
- టెక్నాలజీతో హైదరాబాద్ రూపురేఖలు మార్పు
- 8 వారాల్లో దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్: సీఎం
- అలెక్స్ కిప్మన్తో రేవంత్ రెడ్డి సమావేశం.. ట్రాఫిక్, వరదలు, కాలుష్య నియంత్రణపై చర్చ
హైదరాబాద్, మహా: హైదరాబాద్ను దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దడానికి వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, సరస్సుల రక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కార మార్గాలపై సమావేశంలో చర్చ జరిగింది. ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ ఆధారంగా రియల్టైమ్ సెన్సార్ నెట్వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేయవచ్చని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా హైదరాబాద్ సిటీలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ను పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టాలని నిర్ణయించారు.
హైదరాబాద్ దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్..
ఈ ప్రోగ్రాం ఎనిమిది వారాల పాటు అమలుకానుంది. ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులో భాగంగా సీసీటీవీ వ్యవస్థను రియల్టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారమ్గా మార్చడం జరుగుతుంది. ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవలను ఏఐ ఆధారిత అంచనాలతో ఒకేచోట సమన్వయం చేస్తారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్గా మానిటరింగ్ నిర్వహిస్తారు. పైలట్ ప్రోగ్రాం పూర్తయ్యే సమయానికి హైదరాబాద్ దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారుతుందనే అంచనాలున్నాయి. ముఖ్యమంత్రి భారత్ ఫ్యూచర్ సిటీని పరిశోధన, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను వివరించారు. ఆర్థిక వృద్ధికి ఫిజికల్ ఇంటెలిజెన్స్ అత్యుత్తమ పరిష్కారాలను అందిస్తుందని అలెక్స్ కిప్మన్ పేర్కొన్నారు. డిసెంబర్ 8–9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ముఖ్యమంత్రి అలెక్స్ కిప్మన్ను ఆహ్వానించారు.
=========================








