హైదరాబాద్, మహా
కేంద్ర మంత్రి బండి సంజయ్కు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఊరట దక్కింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చింది. 2023 ఏప్రిల్లో టెన్త్ వార్షిక పరీక్షలు జరుగుతుండగా హన్మకొండ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ పరీక్షకు ముందు పలు వాట్సాప్ గ్రూప్లలో లీక్ అయ్యింది. ఈ పేపర్ లీకేజీ వెనుక అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. బండి సంజయ్కు హన్మకొండ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని కరీంనగర్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కొన్నిరోజులకి ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అనంతరం ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా ఈ కేసును కొట్టివేసింది. కోర్టు కేసు కొట్టివేయడం బీఆర్ఎస్కు చెంపపెట్టు అని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండతో వరంగల్ కమిషనర్ గా ఉన్న రంగనాథే బండి సంజయ్ను జైల్లో పెట్టించేలా చేశారని బీజేపీ శ్రేణులు అప్పట్లో ఆరోపించారు. ఆ తర్వాత రంగనాథ్ వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. తాజాగా ఈ కేసులో బండిసంజయ్కు క్లీన్చిట్ రావడంతో రంగనాథ్పై కూడా బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బండి సంజయ్ కూడా సత్యమేవ జయతే అంటూ ఎక్స్లో పోస్టు చేశారు.








