- ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలు
- కీలక మార్పులు చేసిన నిర్మల
న్యూఢిల్లీ, మహా : కొత్త ఆదాయపు పన్నుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రధాన ప్రకటన చేశారు. ఆదాయపు పన్ను ఫారమ్లను సరళీకరించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. సాంకేతిక లోపాలను జరిమానాలుగా మార్చడానికి ఈ చట్టం పని చేస్తుంది. చిన్న ట్యాక్స్ నేరాలకు జరిమానాలు మాత్రమే విధిస్తారు. విదేశీ ప్రయాణాలపై పన్నులు తగ్గించారు. విదేశీ ప్రయాణాలకు టీసీఎస్ రేటు 5 శాతానికి తగ్గించారు. జూలై 31 వరకు రిటర్న్లను దాఖలు చేయవచ్చు. ఈ చట్టం అప్రకటిత ఆదాయాన్ని కోటి రూపాయలకు పరిమితం చేయాలని కూడా ప్రతిపాదిస్తుంది.
వ్యక్తిగత, స్మాల్ ట్యాక్స్ పేయర్స్కు ఈ బడ్జెట్ భారీ ఉపశమనం కలిగించింది. ఆదాయపు పన్ను రిటర్న్లను (ఐటీఆర్ లు) సవరించడానికి గడువును పొడిగించడంతోపాటు మరికొన్ని మార్పులు చేశారు. నిబంధనలను మరింత సరళీకృతం చేశారు. విధానపరమైన భారాలను తగ్గించడం, తప్పులకు జరిమానాలను తగ్గించడం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలుకు పన్ను చెల్లింపుదారులను సిద్ధం చేయడం ఈ చర్యల లక్ష్యం. నామమాత్రపు రుసుముతో పన్ను చెల్లింపుదారులకు తమ దాఖలులో తప్పులను సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేశారు. ఫ్లెక్సిబుల్ రిటర్న్-ఫైలింగ్ క్యాలెండర్ను కూడా ఆవిష్కరించనున్నట్లు సీతారామన్ తెలిపారు.
మార్చి 31 వరకు సవరించిన ఐటీఆర్ దాఖలుకు అనుమతి
బడ్జెట్ లో కీలకమైన ప్రకటనలలో ఒకటి సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి కాలపరిమితిని పొడిగించడం. ఆర్థిక సంవత్సరం చివరి వరకు పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్లను సవరించుకోవడానికి అనుమతి ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు. నామమాత్రపు రుసుముతో మార్చి 31 వరకు సవరించిన ఐటీఆర్ ను దాఖలు చేయ వచ్చని పేర్కొన్నారు. ఈ చర్య వల్ల ఐటీ దాఖలు చేసిన వారు లోపాలు లేదా ఇతర మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం గడువు, అధిక జరిమానాతో నష్టపోయిన వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మార్చి 31 వరకు సవరణలను అనుమతించడంతో పన్ను చెల్లింపుదారులు, వ్యవస్థ మధ్య ఒక విధమైన సమతుల్యతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియను సులభతరం చేయడం, పన్ను మినహాయింపు (టీడీఎస్) ప్రక్రియలను సులభతరం చేయడానికి, ఎలాంటి గందరగోళం లేకుండా చేసే సంస్కరణలను ప్రకటించడంపై సీతారామన్ దృష్టి సారించారు. క్రమబద్ధీకరించిన విధానాలతో పాటు, రిటర్న్ కోసం సుదీర్ఘ టైంలైన్, మరింత నిర్మాణాత్మక ఫైలింగ్ షెడ్యూల్ను ప్రతిపాదించారు. సీతారామన్ ఇలా అన్నారు: “”ఆదాయ పన్ను చట్టం, 2025, ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. ప్రక్రియను సులభతరం చేయడానికి, రిటర్న్లను దాఖలు చేయడానికి నేను ఫ్లెక్సిబుల్ టైంలైన్ను ప్రతిపాదిస్తున్నాను: ఐటీఆర్-1, ఐటీఆర్ -2 ఉపయోగించే వ్యక్తులు జూలై 31 వరకు దాఖలు చేయడం కొనసాగించవచ్చు, అయితే ఆడిట్ కాని వ్యాపార కేసులు, ట్రస్టులకు ఆగస్టు 31 వరకు సమయం ఉంటుంది.







