Mahaa Daily Exclusive

  తమిళనాడు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల…*శ్రీపెరుంబుదూరు బరిలో సెల్వపెరుంతగై

Share

చెన్నై, మహా.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం వేడెక్కుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న హస్తం పార్టీ, శుక్రవారం 27 మంది అభ్యర్థులతో కూడిన అధికారిక జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ విడుదల చేశారు. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగైతో పాటు పలువురు సీనియర్ నేతలకు మరోసారి అవకాశం దక్కింది.
శ్రీపెరుంబుదూరు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై తిరిగి పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆయన ఏఐఏడీఎంకే అభ్యర్థి కె. పళనిపై 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదేవిధంగా, పొన్నేరి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దురై చంద్రశేఖర్‌ను పార్టీ మళ్లీ బరిలోకి దింపింది. కృష్ణగిరి నుంచి డాక్టర్ ఎ. చెల్ల కుమార్, వేలచ్చేరి నుంచి జేఎంహెచ్ ఆసాన్ మౌలానా, షోలింగూర్ నుంచి ఏ.ఎం. మునిరత్నం, ఉతంగారై (ఎస్సీ) నుంచి ఆర్. కుప్పుస్వామి పోటీ చేయనున్నారు. సింగనల్లూరు నుంచి ఎంఎస్ వి. శ్రీనిధి నాయుడు, మయిలాడుతురై నుంచి జమాల్ యూనస్ మొహమ్మద్ బరిలో నిలిచారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, మార్చి 30న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 6వ తేదీతో ముగియనుంది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం మే 4వ తేదీన ఫలితాలు వెలువడతాయి. డీఎంకేతో సీట్ల సర్దుబాటు కుదిరిన తర్వాత, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఈ జాబితాను ఖరారు చేసింది. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో, అభ్యర్థులందరూ తమతమ నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Latest