ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేస్తోంది. ఇప్పటి వరకు అందిస్తున్న మెనూ మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. మరింత రుచికరంగా భోజనం విద్యార్ధులకు అందించేలా మార్గదర్శకాలు సిద్దం అవుతున్నాయి. రుచి, నాణ్యతను పాటిస్తూ భోజనం మెనూలో మార్పులు చేయనున్నారు. కొత్త మెనూను దీపావళి నుంచి అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పథకంలో మార్పులు
వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన గోరుమద్ద పథకాన్ని కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా కొనసాగిస్తోంది. ఈ పథకం అమలు కోసం అందిస్తున్న ముడి సరుకును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ రోజు ఒకే విధంగా కాకుండా.. రోజుకో మెనూ ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఒక రోజు మినహా వారంలో మిగిలిన అన్ని రోజులు కోడి గుడ్డు అందిస్తున్నారు. ఉదయం రాగిజావ ఇస్తున్నారు. అయితే, ప్రభుత్వం కొత్త మెనూ అమలుకు సిద్దమైంది. మార్పులు నిర్ణయించింది.
కొత్త మెనూ సిద్దం
ఇక నుంచి..సాంబార్ బాత్ను రెండూ కలిసి కాకుండా వేర్వేరుగా వడ్డించేలా నిర్ణయించారు. వారంలో ఐదు రోజులు ఇస్తున్న గుడ్డును.. మూడు రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అందిస్తు్న్న రాగి జావలో సుగంధ ద్రవ్యాలు కలపాలని యోచిస్తున్నారు. పచ్చళ్లలో గోంగూర లేదా బీర/వంకాయలను కూడా చేర్చనున్నారు. ప్రస్తుతం ఉన్న బియ్యం స్థానంలో సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
డ్రైఫ్రూట్స్ లడ్డూ
వారంలో అన్ని రోజులూ రాగిజావ ఇవ్వకుండా కేక్, లడ్డూలను డ్రైపూట్స్తో కలిపి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక పాఠశాల పిల్లలకు వంద గ్రాములు, పై తరగతతులకు 150 గ్రాముల బియ్యం కేటాయిస్తున్నారు. వీటి పరిమాణం మరింత పెంచనున్నారు. వంట గ్యాస్ను రాయితీ ధరకు అందించనున్నారు. భోజన పదార్ధాలను తయారీకి అల్యూమినయం పాత్రలు సమకూర్చనున్నారు. వారానికి ఒక రోజు మోనూలో అరటి పండు, మజ్జిగ కూడా చేర్చేలాగా మెనూలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.







