ఆధునిక యుద్ధక్షేత్రంలో ‘ఏఐ’దే కీలకం.
*సత్వర నిర్ణయాలు, వనరుల నిర్వహణకు తప్పనిసరి.
*డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలి.
* ఎన్డీఏ పాసింగ్ అవుట్ పరేడ్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.
పుణె,మహా.
మారుతున్న కాలంతో పాటు యుద్ధ తంత్రాల్లోనూ సంక్లిష్టతలు పెరుగుతున్నాయని, ఆధునిక యుద్ధ క్షేత్రంలో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అత్యంత కీలకమని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. భారీ వనరుల నిర్వహణ, సమాచార విశ్లేషణకు ఆటోమేషన్, ఏఐ ఎంతగానో అవసరమని ఆయన ఉద్ఘాటించారు. శనివారం పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో జరిగిన 150వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్కు హాజరైన ఆయన కవాతును సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రక్షణ రంగంలో సాంకేతికత ఆవశ్యకతను వివరించారు.
ప్రస్తుత కాలంలో యుద్ధ క్షేత్రాలు భారీ స్థాయిలో సమాచారాన్ని సృష్టిస్తున్నాయని, అనేక రకాల వనరులు ఇందులో భాగమవుతున్నాయని సైన్యాధిపతి తెలిపారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కమాండర్లు, సైనికులు ఆ సమాచారాన్ని వేగంగా విశ్లేషించి, తక్షణమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. యుద్ధ వేగం పెరిగినప్పుడు, సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు అదనపు సాంకేతిక మద్దతు ఎంతో అవసరమని.. సరిగ్గా ఇక్కడే ఏఐ ప్రాధాన్యం సంతరించుకుంటుందని వివరించారు. భారీ వనరులను ఏకకాలంలో నియంత్రించడం కష్టమైనప్పుడు ఏఐ అద్భుతంగా సాయపడుతుందని జనరల్ ద్వివేది పేర్కొన్నారు.
సైనిక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ‘అబ్జర్వ్, ఓరియెంట్, డిసైడ్, యాక్ట్’ (ఓఓడీఏ) అనే సైకిల్ ఉంటుందని.. అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏఐ సాంకేతికతలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేయడానికి, వనరులను సరైన రీతిలో కేటాయించడానికి స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.
అదే సమయంలో ఆధునిక సైనిక కార్యకలాపాల్లో డ్రోన్ల పాత్ర గణనీయంగా పెరిగిందని జనరల్ ద్వివేది గుర్తుచేశారు. ప్రస్తుత వాతావరణంలో శత్రువుల నుంచి డ్రోన్ల ముప్పు అధికంగా ఉందని, వాటిని దీటుగా ఎదుర్కోవడానికి పటిష్ఠమైన కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు అవసరమని స్పష్టం చేశారు. అలాగే మన డ్రోన్లను సైతం యుద్ధరంగంలో అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు. యుద్ధ క్షేత్రంలో డ్రోన్లు, సెన్సార్లు, నిఘా పరికరాలు వంటి వనరులు భారీగా పెరిగిపోయాయని, వాటన్నింటినీ లోపాల్లేకుండా నిర్వహించడానికి ఆటోమేషన్ తప్పనిసరి అని.. ఇందుకు ఏఐ ఒక బలమైన సాధనంగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.








