- తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన
- నేడు వరగల్ లో అభిమాని నిరంజన్ ఇంటికి జనసేనాని
- ఇటీవలి రాజకీయ పరిణామాలతో హాట్ టాపిక్ గా మారిన పవన్ పర్యటన
హైదరాబాద్, మహా : పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. ఈ పర్యటనకు ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ కారణం ఉంది. నేడు వరంగల్ హనుమకొండలో మృత్యువుతో పోరాడుతున్న తన వీరాభిమాని నిరంజన్ చివరి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ అతని ఇంటికి వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ ను చూడాలనే తన చివరి కోరిక మేరకు అతని ఇంటికి వెళ్లనున్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
జన్యపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్
హనుమకొండకు చెందిన నిరంజన్కు పదహారేళ్లు. చిన్నప్పుడు మామూలుగానే ఉండేవాడు. అయితే కానీ, 8 ఏళ్ల క్రితం అతడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. జన్యుపరమైన డీఎండీ వ్యాధి బారిన పడి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. ఎదుగుదల పూర్తిగా లోపించింది. కాస్త గట్టిగా పట్టుకుంటే భరించలేని నొప్పి. ఇటీవల టీవీలో సీఎం రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ చూసిన నిరంజన్ ఆయన్ను, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను కలవాలనుందని తెలిపాడు. నిరంజన్ కోరికను జనసేన నేతలు, పవన్ అభిమానులు ఆయనకు వివరించారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన పవన్ కల్యాణ్ నేడు హనుమకొండ వచ్చి నిరంజన్ను పరామర్శించనున్నారు. జనసేనాని టూర్ నేపథ్యంలో ఆ పార్టీ నేతులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోనుంది.
ఇటీవల రాజకీయ పరిణామాలతో పవన్ పర్యటనపై ఆసక్తి
గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్కు మధ్య తీవ్రమైన వాగ్వాదం నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జనసేన నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు, హైకోర్టు అనుమతి నిరాకరించడం వివాదానికి కేంద్ర బిందువైంది. దీనిపై జూబ్లీహిల్స్ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ తెలంగాణ ఎవరి సొంత జాగీరు కాదు.. నన్ను హైదరాబాద్ రాకుండా ఆపేదెవరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా జరిగిన పార్టీ సేన ప్రస్థానం సమావేశంలోనూ తెలంగాణ అమరవీరులను గుర్తించడానికి ఈ పాలకులకు 12 ఏళ్లు సరిపోలేదా అంటూ కాంగ్రెస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు.
రాజకీయాలకు అతీతంగా పవన్ పర్యటన
పవన్ కళ్యాణ్ కేవలం అభిమాని నిరంజన్ను కలిసి వెళ్ళిపోయినా.. ప్రస్తుతమున్న పొలిటికల్ టెన్షన్స్ దృష్ట్యా దానికి రాజకీయ ప్రాధాన్యత లభించడం ఖాయం. ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదని పవన్ మాట్లాడటాన్ని, తెలంగాణ సెంటిమెంట్ను తక్కువ చేసి చూపడంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరగడాన్ని తాము అడ్డుకుంటామని ఇప్పటికే కొంతమంది ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పవన్ పర్యటించే నియోజకవర్గం లేదా రూట్ మ్యాప్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలిపే లేదా అడ్డుకునే ప్రయత్నాలుఉన్నాయని భావిస్తున్నారు. ఈ పర్యటన కేవలం ఒక అభిమానిని కలవడం కోసమే కాబట్టి ఎలాంటి రాజకీయ ప్రసంగాలు ఉండకపోవచ్చని జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ వస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం భద్రత కల్పించాల్సి ఉంటుంది.








