Mahaa Daily Exclusive

  ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం…

Share

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం.
* ఎఫ్‌ఏటీఎఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఐఏఎస్‌ అధికారి వివేక్‌ అగర్వాల్‌.
* ఈ స్థాయి పదవి దక్కించుకున్న తొలి భారతీయ అధికారిగా రికార్డు.
ఢిల్లీ, మహా.
అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థల ఆర్థిక మూలాలను ఛేదించి, అక్రమ నగదు రవాణా (మనీ లాండరింగ్) నెట్‌వర్క్‌లను సమూలంగా దెబ్బతీసేందుకు ఏర్పాటైన ప్రతిష్ఠాత్మక ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ (ఎఫ్ఏటీఎఫ్) లో భారతదేశానికి అత్యంత కీలక బాధ్యతలు దక్కాయి. ఈ అంతర్జాతీయ సంస్థకు ఉపాధ్యక్షుడిగా (వైస్‌ ప్రెసిడెంట్‌) మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఎఫ్‌ఏటీఎఫ్‌ లాంటి గ్లోబల్ వాచ్‌డాగ్‌లో ఒక భారతీయ అధికారికి ఇంతటి అత్యున్నత స్థాయి బాధ్యతలు దక్కడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఈ కీలక సమాచారాన్ని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నిధులు అందకుండా అడ్డుకట్ట వేసేందుకు చేపడుతున్న కఠిన చర్యల్లో భారత్‌కు దక్కుతున్న ప్రాధాన్యానికి ఈ నియామకమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదంపై దేశం సాగిస్తున్న రాజీలేని పోరులో ఇది ముమ్మాటికీ ఒక భారీ విజయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
**ఎవరీ వివేక్ అగర్వాల్.. ఆయన నేపథ్యం ఏంటి?**
ఎఫ్‌ఏటీఎఫ్‌ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన వివేక్ అగర్వాల్.. పరిపాలన, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో విశేష అనుభవం, ప్రావీణ్యం ఉన్న నిపుణుడు. ప్రస్తుతం ఆయన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో పలు కీలక పోస్టుల్లో విశేష సేవలందించారు. మధ్యప్రదేశ్‌ కేడర్‌లో ఆయన 2025లో చీఫ్ సెక్రటరీ గ్రేడ్ అధికారిగా పదోన్నతి పొందారు. గతంలో ఆయన కేంద్ర రెవెన్యూ శాఖ అదనపు కార్యదర్శిగా, అలాగే ‘ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్’ డైరెక్టర్‌గా కూడా తనదైన ముద్ర వేశారు.
విద్యాభ్యాసం విషయానికి వస్తే.. వివేక్ అగర్వాల్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి బీకామ్, ఎల్ఎల్‌బీ పట్టాలు అందుకున్నారు. అనంతరం ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా’ (ఐసీఎస్‌ఐ) నుంచి సీఎస్ (ఇంటర్) కూడా పూర్తి చేశారు. వీటికి తోడు, ప్రతిష్ఠాత్మక ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన ఓ ప్రత్యేక కోర్సును సైతం ఆయన అభ్యసించడం గమనార్హం. ఆయనకున్న ఈ విశేష ఆర్థిక పరిజ్ఞానం, పరిపాలనా దక్షతే ఎఫ్‌ఏటీఎఫ్‌లో ఈ అత్యున్నత పదవి వరించడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.