Mahaa Daily Exclusive

  లగచర్ల దాడి ఘటన వెనుక బీఆర్ఎస్: భట్టి విక్రమార్క..

Share

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పైన, అధికారుల పైన దాడి చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటన వెనుక బిఆర్ఎస్ పార్టీ ఉందని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి చేయించింది బీఆర్ఎస్ పార్టీ నేనని సంచలన ఆరోపణ చేశారు.

 

కేసిఆర్ ఈ ఘటన పైన ఎందుకు మాట్లాడటం లేదు: భట్టి విక్రమార్క

కలెక్టర్ పై జరిగిన దాడిని బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. దాడులతో రాష్ట్రాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారో చెప్పాలని బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. పది సంవత్సరాలు సీఎం గా పనిచేసిన కేసిఆర్ ఈ ఘటన పైన ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని బట్టి విక్రమార్క నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన అక్కసుతో బిఆర్ఎస్ ఈ తరహా చర్యలకు దిగుతోందని ఆరోపించారు.

 

బీఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతంగా లేదు

బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కేవలం అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

బీఆర్ఎస్ నీచమైన కుట్రలు

కొడంగల్ లో ఫార్మ విలేజ్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ప్లాన్ చేస్తున్నామని చెప్పిన ఆయన గ్రామీణ ప్రాంతాలకు కూడా అభివృద్ధిని విస్తరింప చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ ఫార్మా విలేజి ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఈ విధంగా వ్యవహరించలేదని కానీ బీఆర్ఎస్ నీచమైన కుట్రలు చేస్తూ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.

 

భూములు కోల్పోయే వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ

ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం పోరాటం చేయొచ్చని కానీ ఆ పద్ధతి బీఆర్ఎస్ కు లేదన్నారు. పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తే తప్ప ప్రపంచంతో పోటీ పడలేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక ఫార్మా విలేజ్ లో భూములు కోల్పోతున్న రైతుల బాధ తమకు తెలుసని పేర్కొన్న ఆయన భూములు కోల్పోయే వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తున్నామని వెల్లడించారు.

 

మీకోసం అమాయక ప్రజలు బలి కావాలా?

గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలోనూ అమాయక ప్రజలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. మీకోసం అమాయక ప్రజలు బలి కావాలా అంటూ భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దాడి ఘటన పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పై దాడి చేసిన వారి కాల్ డేటాను తీస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.