హైదరాబాద్ సిటీ, మహా
భాగ్యనగరాన్ని మంగళవారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా కార్యాలయాల పనివేళలు ముగిసే సమయం కావడంతో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మియాపూర్, కూకట్పల్లి, రాయదుర్గం, మణికొండ, యూసుఫ్గూడ, ఖైరతాబాద్, కోఠి, మలక్పేట, దిల్సుఖ్నగర్ సహా నగరంలోని పలు ప్రాంతాల్లోపై వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీసులు రంగంలోకి దిగి కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అదే సమయంలో హైడ్రా బృందాలు రహదారులపై నిలిచిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేశాయి. కాగా, సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కూడా నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది.








