చైనా వైరస్ హెచ్ఎంపీవీ ప్రభావం భారత్ పై మొదలైంది. ఇవాళ ఒక్కరోజే బెంగళూరు ఆస్పత్రిలో ఈ వైరస్ లక్షణాలను ఇద్దరు చిన్నారుల్లో గుర్తించారు. ఇప్పటికే వారి నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ ను ప్రైవేట్ ల్యాబ్స్ కు పంపిన డాక్టర్లు.. వీరికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు.
బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో తాజాగా వైద్యం తీసుకుని డిశ్చార్జ్ అయిన మూడు నెలల చిన్నారితో పాటు ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్న మరో 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైరస్ నిర్ధారణ ల్యాబ్ లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపి వైరస్ ను నిర్ధారించారు. అయితే ఈ ఇద్దరు చిన్నారులకూ తాజాగా బయట తిరిగిన చరిత్ర లేకపోవడం విశేషం. ఇతర ప్రాంతాలకు, దేశాలకు వారు అస్సలు వెళ్లలేదని కర్నాటక ఆరోగ్య శాఖ చెబుతోంది. చైనాలో శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే వైరస్ లు చలికాలంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా హెచ్ఎంపీవీ తాజా పరిస్ధితిని అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇతర ఆరోగ్య సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే ఓ భేటీ ఏర్పాటు చేసింది. జూన్ 4న వీరందరితో కూడిన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. ఇందులో హెచ్ఎంపీవీ వైరస్ తో పాటు ఇతర వైరస్ లపై నిపుణుల చర్చించారు. అంతలోనే బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి.







