మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో మాట్లాడని వారికి ఓటేయొద్దని ఆయన పేర్కొన్నారు. తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ వర్సిటీ వేదికగా జరుగుతున్న రెండవ ప్రపంచ మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినదే కాదన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని, సినిమా సంభాషణలు కూడా తెలుగులో ఉండాలన్నారు. ఆంగ్లంలో మాట్లాడకపోతే నామోషీ అనే భావన సరికాదన్నారు. అమ్మ భాషను మరిచిపోతే అమ్మను కూడా మరిచిపోయినట్టేనని అన్నారు. ఇంగ్లిష్ భాష వాడుతూ తెలుగు భాషను దిగజారుస్తున్నారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చి తెలుగు మాట్లాడుతున్నారని, కానీ, మన భాషను మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నామని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు.








