మహా: రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు రావాలంటే 30 శాతం కమీషన్ చెల్లించాల్సి వస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. సంవత్సరాలుగా బిల్లులు రాకుండా చాలా మంది కాంట్రాక్టర్లు, సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదని విమర్శించారు. శుక్రవారం నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. గురువారం జరిగిన కేబినెట్ నిర్ణయాలపై ఆమె మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కేబినెట్ సమావేశం ద్వారా ఈ ప్రభుత్వం, మంత్రి వర్గం ఏమీ తేల్చింది లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్లో ఉంటే కేవలం ఒక్క డీఏ ప్రకటించడం అనేది సిగ్గు చేటని విమర్శించారు. ఐదు గంటల పాటు కేబినెట్లో చర్చించి ఒక్క డీఏ ప్రకటించడం అంటే రాష్ట్రంలోని అందరు ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా అవమానించినట్లే అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే పెండింగ్లో ఉన్న మిగతా డీఏలను కూడా తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఆర్ఆర్ ట్యాక్స్ అని ఫేమస్ అయిందని గుర్తుకు చేశారు. రోడ్లు వేస్తున్నాం.. అది చేస్తున్నామని పనులు సైతం కాగితాల వరకే పరిమితం అయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని కొత్తగా టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని తెలిపారు. ఎవరైతే కమీషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వారికే బిల్లులు క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో తెలంగాణలో రోడ్ల నిర్మాణం తప్పితే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రోడ్ల నిర్మాణం జరగడం లేదని అన్నారు. చిన్న.. సన్న కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు కూడా వెంటనే చెల్లించాలని డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








